
భారత మార్కెట్లో వెండి ధరలు అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 18, 2025 మధ్య కాలంలో అంటే జస్ట్ 3 రోజుల్లోనే దాదాపు రూ.18వేలు తగ్గాయి. దీనికి ముందు సిల్వర్ భారీ ర్యాలీని నమోదు చేయటంతో రిటైల్ మార్కెట్లో భారీగా షార్టేజ్ కూడా కనిపించింది. ప్రధానంగా ఇంకా రేట్లు పెరుగుతాయనే భయాలే కొనుగోలుదారుల నుంచి డిమాండ్ క్రియేట్ చేసినట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఒక్కసారిగా వెండి రేట్లు యూటర్న్ ఎందుకు తీసుకున్నాయి.. భవిష్యత్తు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి ధర తగ్గుదలకు కీలక అంశాలు..
1. లాభాల బుకింగ్:
కొన్ని రోజుల ముందు అక్టోబర్ 15న భారతదేశంలో వెండి ధరలు కేజీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.2లక్షల 08వేలకు చేరాయి. ఇంత భారీ రన్-అప్ తర్వాత.. పెట్టుబడిదారులు తరచుగా లాభాలను లాక్ చేయటానికి అమ్మకాలకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలు మార్కెట్ దిద్దుబాటుకు దారితీస్తుంటాయి.
2. భారీ ర్యాలీ నుంచి కరెక్షన్:
బలమైన పారిశ్రామిక డిమాండ్, చారిత్రాత్మక మార్కెట్ షార్ట్ స్క్వీజ్ కారణంగా 2025 అక్టోబర్ వరకు వెండి ధరలు భారీ ర్యాలీని చూశాయి. ఈ క్రమంలో విశ్లేషకులు ప్రస్తుత రేట్ల పుల్బ్యాక్ను ఆరోగ్యకరమైన మార్కెట్ దిద్దుబాటుగా భావిస్తున్నారు.
3. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల రేట్ల పతనానికి దోహదపడే అంశం కావచ్చునని మార్కెట్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. అస్థిరత ఉన్న కాలంలో వెండి వంటి విలువైన లోహాలు తరచుగా వాటి "సురక్షిత స్వర్గధామం" స్థితి నుంచి ప్రయోజనం పొందుతాయి. కాబట్టి ప్రశాంతమైన ప్రపంచ పరిస్థితి వాటికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గిస్తుంది.
►ALSO READ | దీపావళి బంపర్ ఆఫర్: కేవలం 1 రూపాయికే నెల మొత్తం 4G ఇంటర్నెట్, కాల్స్ ఫ్రీ...
వెండికి భారీ లేదా స్వల్పకాలిక అస్థిరత అసాధారణం కాదు. వెండి మార్కెట్ బంగారం కంటే చిన్నది. తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటుంది. ఇది ధరల కదలికలను పెంచుతుంది. అదనంగా ప్రధానంగా విలువైన, లిక్విడిటీ కలిగిన లోహంగా పరిగణించబడే బంగారం మాదిరి కాకుండా.. వెండి డిమాండ్లో సగానికి పైగా పారిశ్రామిక రంగం నుంచి ఉంది. వీటన్నింటికి మించి సరఫరా కొరతలు ఉండటం రేట్ల పెరుగుదలకు మరో కీలక కారణంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.