తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచ్ గా గెలిచింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గొల్ల రమాదేవి విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 293 ఓట్లు ఉండగా 237 ఓట్లు పోలయ్యాయి. అయిదే వీటిలో 4 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ ఎస్ అభ్యర్థి దుర్గనోళ్ల మౌనికకు 116 ఓట్లు రాగా .. గొల్ల రమాదేవికి 117 ఓట్లు రావడంతో సర్పంచ్ గా ఆమె గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపెల్లి లో కూడా సేమ్ సిచ్యువేషన్.. గ్రామ సర్పంచిగా ఒక్క ఓటు మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నందగిరి కనకలక్ష్మి విజయం సాధించారు.
మరోవైపు డ్రాలో అదృష్టం వరించడంతో ఓ అభ్యర్థి సర్పంచ్ పదవికి ఎంపికైంది. మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్ గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించింది. గ్రామంలో మొత్తం 377 ఓట్లు ఉండగా.. కాంగ్రెస్ బలపరిచిన సునీతకు, బీఆర్ఎస్ బలపరిచిన బీమిలికి 182 ఓట్ల చొప్పున సమంగా వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి పోల్ అవగా.. ఒక ఓటు నోటాకు పడింది. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. డ్రాలో కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి పేరు రావడంతో సునీతను సర్పంచ్ పదవి వరించింది.
