ఆర్కేపీ ఓసీపీలో కూలిన మట్టి బెంచీలు

ఆర్కేపీ ఓసీపీలో కూలిన మట్టి బెంచీలు

రామకృష్ణాపూర్, వెలుగు: ఇటీవల కురిసిన వర్షానికి మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ఓసీపీలో భారీగా మట్టి బెంచీలు(బొగ్గు ఉత్పత్తి కోసం మట్టిని తీసేందుకు రెడీ చేసిన ప్రాంతం) కూలిపోయాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా సింగరేణి జాగ్రత్తపడగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓసీపీలోని సౌత్​​వెస్ట్​సైడ్​లో గత నెల 22న సుమారు 100 మీటర్ల ఎత్తు, అర కి.మీ పొడవున మట్టి బెంచీలు స్లైడింగ్ అయ్యాయి. బెంచీలు కూలిపోవడంతో అక్కడే ఉన్న పంప్​స్టేషన్(పంపులు, కేబుల్స్​, స్టార్టర్లు, స్వీచ్​లు, వాటర్​ సంప్​)​ పూర్తిగా మునిగిపోయింది.

పంప్​ స్టేషన్​లోని నీళ్ల సంపు మునిగి అందులోని నీళ్లన్నీ పైకి వచ్చి సమీపంలో బొగ్గు ఉత్పత్తి పనులు చేపట్టిన మహాలక్ష్మి ఓబీ కాంట్రాక్ట్​ సంస్థకు కేటాయించిన స్థలంలోకి చేరాయి. దీంతో సదరు కంపెనీ కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. నీటిని తొలగించి బెంచీలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు మరో నాలుగు నెలల టైమ్​ పట్టే చాన్స్ ఉంది. దీంతో సింగరేణి సంస్థ అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని వేరొక చోటుకు బదిలీ చేసే ప్రయత్నంలో ఉంది. మరోవైపు సదరు కాంట్రాక్ట్​ కంపెనీకి మరో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గనిలో 90శాతం ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి పనులను ప్రైవేటు కాంట్రాక్ట్​ సంస్థ నిర్వహిస్తుండగా.. మిగిలిన పది శాతం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఉద్యోగుల్లో భయం..
ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​ గనిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ భయం పట్టుకుంది. గనిలో పనులు లేవంటూ సిబ్బందిని బలవంతంగా ఇతర ప్రాంతాలకు పంపేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ గనిలో ఆపరేటర్లు, ఎలక్ర్టిషియన్లు సుమారు 150 మంది పనిచేస్తుండగా.. వీరందరినీ మరో రెండు, మూడు రోజుల్లో ట్రాన్స్​ఫర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, గని పీవో, సేఫ్టీ ఆఫీసర్​ నిర్లక్ష్యం కారణంగానే బెంచీల స్లైడింగ్​ సమస్య వచ్చిందని , ఉద్యోగులను మందమర్రి ఏరియాలోనే సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ డిమాండ్ చేశారు.