సింగరేణిలో మ్యాన్ పవర్పై స్టడీ.. ఇందుకోసం కన్సల్టెన్సీలకు యాజమాన్యం పిలుపు

 సింగరేణిలో మ్యాన్ పవర్పై స్టడీ.. ఇందుకోసం కన్సల్టెన్సీలకు యాజమాన్యం పిలుపు
  • ఇందుకోసం కన్సల్టెన్సీలకు యాజమాన్యం పిలుపు
  • మైనింగేతర రంగాల్లో పలువురు మైనింగ్​ ఉన్నతాధికారులు
  • సింగరేణిలో మెడికల్ బోర్డుకు మంగళం పాడినట్టేనా..
  • కంపెనీలో మరోసారి  సీఆర్ఎస్ అమల్లోకి వచ్చేనా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో మ్యాన్​పవర్​పై స్టడీకి యాజమాన్యం కన్సల్టెన్సీల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి కలిగిన కన్సల్టెన్సీలు ఈనెల 10లోపు సింగరేణి సంస్థ చూపిన ఫార్మాట్లో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సింగరేణిలో  వేల సంఖ్యలో సర్​ప్లస్​లో కార్మికులు ఉన్నారని ఇటీవల పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సర్​ప్లస్ నేపథ్యంలో మెడికల్​బోర్డును కూడా యాజమాన్యం గత కొద్ది నెలలుగా నిర్వహించడం లేదు. 

మరోవైపు మైనింగ్​కు చెందిన ఉన్నతాధికారులు మైనింగేతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సర్​ప్లస్​కార్మికులతోపాటు ఏఏ విభాగాల్లో ఎవరు పనిచేస్తున్నారనే విషయమై తెలుసుకునేందుకు మ్యాన్​పవర్​ స్టడీ చేయించడం ఆసక్తిగా  కలిగిస్తోంది.

మ్యాన్ పవర్​పై స్టడీ..

సింగరేణి కంపెనీలో దాదాపు 42 వేల మందికి పైగా రెగ్యులర్​ఉద్యోగులు(కార్మికులు), ఆఫీసర్లు పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాల కిందట లక్ష వరకు కార్మికులుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 42 వేలకు తగ్గింది.మైన్స్ ఒక్కొక్కటిగా మూత పడ్తుండడం, కొత్త మైన్స్ రాకపోవడంతో కార్మికులను సర్దిబాటు చేయడం కంపెనీకి తలకు మించిన భారంగా మారింది. కంపెనీలో దాదాపు ఏడు వేల నుంచి పది వేల మంది వరకు ఉద్యోగులు సర్​ ప్లస్​లో ఉన్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

మైనింగేతర రంగాల్లో మైనింగ్​డిపార్ట్​మెంట్​కు చెందిన ముఖ్యఅధికారులు విధులు నిర్వహిస్తున్నట్టుగా యాజమాన్యం గుర్తించింది. మైనింగ్​ఆఫీసర్లు మైనింగేతర రంగాల్లో పనిచేయడం మూలంగా అటు  బొగ్గు ఉత్పత్తిలో ఇటు మైనింగేతర రంగాల్లోనూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడినట్టుగా యాజమాన్యం గుర్తించింది. 

కంపెనీలో సీఆర్​ఎస్​ టెన్షన్..

మ్యాన్ పవర్ స్టడీపై కార్మికుల్లో సీఆర్ఎస్ టెన్షన్ నెలకొంది. గతంలో కంపల్సరీ రిటైర్​మెంట్ స్కీం (సీఆర్​ఎస్​), వాలంటరీ రిటైర్ మెంట్​స్కీం(వీఆర్​ఎస్)​ గోల్డెన్ షేక్ హ్యాండ్​ పేర పలు స్కీంలను యాజమాన్యం అమలు చేసింది. ఈ క్రమంలోనే మ్యాన్​పవర్​ స్టడీకి ఆసక్తి గల కన్సల్టెన్సీ సంస్థలను టెండర్లు పిలువడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. 

కొత్త మైన్స్​తోనే భవిష్యత్..

సింగరేణిలో కొత్త మైన్స్​ వస్తేనే కార్మికులకు భవిష్యత్ ఉంటుందని యూనియన్ల లీడర్లు పేర్కొంటున్నారు. కొత్త మైన్స్​ తీసుకొచ్చి కార్మికులను సర్దుబాటు చేయడంతోపాటు మెడికల్​బోర్డును నిర్వహించేందుకు యాజమాన్యంతోపాటు ప్రభుత్వం చొరవ చూపాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. 

సర్ ప్లస్ పేర మెడికల్​బోర్డుకు మంగళం పాడినట్టేనా..

సింగరేణిలో కార్మికులకు వరప్రదాయిని మెడికల్​బోర్డు. మెడికల్​బోర్డు ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తమ వారసులకు ఇన్వాలిడేషన్ పేర సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కంపెనీ ఒక మంచి సదుద్దేశంతో ఈ స్కీంను అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఆఫీసర్లు, దళారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మెడికల్​బోర్డులో కార్మికులు అన్​ఫిట్​కావాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అక్రమ వసూళ్లు చేపట్టారు. 

ఈ దందాను అరికట్టేందుకు గతంలో యాజమాన్యం ఏసీబీకి లేఖ రాసింది. అయినప్పటికీ దందా పెద్దగా ఆగలేదు. ఇదే టైంలో సర్​ప్లస్​ విషయం కంపెనీలో చర్చ మొదలైంది. ఇప్పటికే కంపెనీలో ఐఈడీ లెక్కల ప్రకారంగా అవసరానికి మించి ఎక్కువ మంది కార్మికులున్నట్టు సీఎండీ గతంలో పేర్కొన్న దాఖలాలున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడెనిమిది నెలలుగా మెడికల్​ బోర్డును యాజమాన్యం నిలిపివేసింది. మెడికల్​ బోర్డు నిర్వహించకపోవడంతో ఇక భవిష్యత్​లో మెడికల్​ బోర్డు మిథ్యేనా అనే చర్చ కార్మికుల్లో కొనసాగుతోంది.