వేసవి సెలవులు అయిపోయాయ్.. బడులు మొదలయ్యాయ్.. పాపం కొందరు పిల్లలు మాత్రం..

వేసవి సెలవులు అయిపోయాయ్.. బడులు మొదలయ్యాయ్.. పాపం కొందరు పిల్లలు మాత్రం..

మానవ జీవితంలో బాల్యదశ కీలకమైనది. ఈ దశలో పిల్లలు చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి. కానీ, కొందరు బాలలు చదువు, ఆటలకు దూరమై శ్రామికులుగా జీవిస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగించుకొని బడులు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరగనుంది. ఈ రెండు  బాలలకు సంబంధించి దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఒకటి సెలవుల్లో ఆనందంగా గడిపిన బాలల్ని పాఠశాల అనే జ్ఞాన గుడికి రమ్మంటోంది. మరొకటి అంధకారపు శ్రామిక జీవితాన్ని అనుభవిస్తున్న బాలల్ని విముక్తి చేసి వికాసం వైపు నడిపిస్తుంది.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. నేటి ఆధునిక యుగంలో ఇది ప్రత్యక్షంగా కనబడకపోయినా పరోక్షంగా కొనసాగుతుంది. కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు కారణంగా కొందరు బాలలు వ్యవసాయ పనుల్లో, ఇళ్లలో, హోటళ్లలో, కర్మాగారాల్లో, దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఫలితంగా వారి భవిష్యత్ అంధకారంగా మారుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘పురోగతి స్పష్టంగా ఉంది, కానీ ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంది: ప్రయత్నాలను వేగవంతం చేద్దాం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రపంచం బాల కార్మికులను తగ్గించడంలో స్థిరమైన పురోగతి సాధిస్తోంది. దీనిపై ప్రభుత్వాలు  ప్రత్యేకంగా దృష్టిసారించాలి. బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలి. చదువుల ఒత్తిడిని దూరం చేయాలి. బాల్య దశ నుంచే నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, పాఠశాలలు  క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చరమగీతం పాడి, వారి వికాసానికి దోహదపడతాయి.


సంపతి రమేష్ మహారాజ్