ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల నడక రహదారిలో చిన్నారిపై చిరుత దాడి చేయగా.. పక్కనే ఉన్న తమిళనాడులో ఏకంగా మూడు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. నీలగిరి జిల్లా కూడలూరు అటవీ ప్రాంతంలో మూడు చిరుతల మృత దేహాలను కనుగొన్నారు. కూడలూరు పరిధిలో బంధిపుర పులుల అభయారణ్యం ఉంది. మంగళ గ్రామంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. చిరుతల మధ్య గొడవ జరిగిన తరహాలో ఆ పరిసరాలు ఉండడం, దాడిలో ఈ చిరుత మరణించి ఉంటుందని భావించారు.
ALSO READ:పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు
చనిపోయిన చిరుత మృత దేహాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. ఈ ప్రాంతానికి అతి సమీపంలోని తేహంలో మరో మగ చిరుత మృతదేహం బయటపడింది. ఈ రెండు చిరుతలు పరస్పరం దాడి చేసుకుని మరణించి ఉంటాయని భావించారు. అయితే ఇక్కడికి సమీపంలోని కుందలుపేట వద్ద ఇంకో చిరుత మరణించి ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇది విషంతో కూడిన మాంసం తినడంతో మరణించినట్ట పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ చిరుతలు మరణించి మూడు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు.