బెంగళూరు: ఆసియా కప్ కోసం లంక వెళ్లే ముందు టీమిండియా ప్రాక్టీస్ జోరు పెంచింది. మంగళవారం ఉదయం నుంచి ఎన్సీఏలో ప్లేయర్లందరూ తీవ్రంగా చెమటోడ్చారు. సాధారణ ఎక్సర్సైజ్లతో పాటు ఫిట్నెస్కు సంబంధించిన కసరత్తులు చేశారు. తర్వాత యంగ్స్టర్స్ అందరూ వామప్స్లో మునిగిపోయారు. వెన్ను గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ ఇందులో ఉన్నారు. ఇక సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, పేసర్లు మహ్మద్ షమీ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ తమ బౌలింగ్ను పరీక్షించుకున్నారు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సెషన్ను పర్యవేక్షించాడు.
ఇండియా క్యాంప్లో రిషబ్
మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా ట్రెయినింగ్ క్యాంప్ను సందర్శించాడు. గ్రౌండ్లోకి వచ్చిన పంత్ ముందుగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెవిలో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. తర్వాత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కాసేపు మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పిచ్పై తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన పంత్ కాస్త ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. వేగంగా కోలుకుంటున్న పంత్ వరల్డ్ కప్ వరకు టీమ్లోకి వచ్చే అవకాశం ఉంది.
తొలి రెండు మ్యాచ్లకు రాహుల్ దూరం: ద్రవిడ్
తొడ గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను మరో గాయం వేధిస్తోంది. దీంతో సెప్టెంబర్ 2, 4న పాకిస్తాన్, నేపాల్తో జరిగే తొలి రెండు మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. టీమ్తో పాటు రాహుల్ లంకకు వెళ్లకుండా ఎన్సీఏలోనే రిహాబిలిటేషన్లో ఉండనున్నాడు. అయితే సూపర్ స్టేజ్–4 నుంచి రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. ‘ఈ వారం మొత్తం కేఎల్ ప్రాక్టీస్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అతని ప్రోగ్రెస్ కూడా బాగుంది. కానీ చిన్న గాయంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఎన్సీఏలోనే అతను ఉంటాడు. సెప్టెంబర్ 4న అతని గాయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని చీఫ్ కోచ్ ద్రవిడ్ పేర్కొన్నాడు. మరోవైపు సెప్టెంబర్ 5న వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించాల్సిన నేపథ్యంలో రాహుల్ రీ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.