జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
  •  హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినా వేధింపులు ఆపడంలేదని ఫిర్యాదు 
  • నిత్యం కేసులతో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆందోళన
  • జర్నలిజాన్ని  అంతమొందించాలని చూస్తున్నారని ఆరోపణ
  • ఫిర్యాదు పూర్తి వివరాలు వెల్లడించిన నాజా జాతీయ అధ్యక్షులు మురహరి బుద్ధారం 
  • ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ 

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నాజా  జాతీయ అధ్యక్షుడు మురహరి బుద్ధారం బీసీ కమిషన్ కు అందజేశారు.
దొర కాళ్ల ముందు జర్నలిజం మోకరిల్లికపోతే  కేసుల పరంపర కొనసాగిస్తున్నట్టు, తప్పు చేసిన వారిపై వాస్తవిక కథనాలను రిలీజ్ చేస్తే బ్లాక్ మెయిల్ అంటూ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో తెలియజేశారు. ఓ దొంగ స్వామి లీలలపై క్యూ న్యూస్ లో బాధితుల తరపున కథనాలు  రిలీజ్ చేస్తే బ్లాక్ మెయిల్ చేశారన్న నిందలు వేసి విచారణ పేరిట గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాలయాపన చేసి పంపిస్తున్నారని, ఇటువంటి చిన్న కేసుల విషయంలో కూడా పదే పదే పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు ఇస్తుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
తప్పుచేసిన వారిని వెనకేసుకువస్తూ.. నాపై కేసులా
తప్పు చేసిన వారిని వెనకేసుకు వస్తూ  వాస్తవ కథనాలను రిలీజ్ చేసిన నాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేళల్లో  పోలీసులు వాహనాల క్యూ న్యూస్ ఆఫీసుకు వచ్చి సోదాలు చేశారని ఆరోపించారు. కొందరు నాయకుల అవినీతి అక్రమాలకు ఆధారాలు  లేకుండా  డేటా,హర్డు డిస్కు లు తీసుకెళ్లారని ఫిర్యాదులో తెలిపారు. దిగువ, వెనుకబడిన తరగతికి చెందిన వారిని ఎక్కువగా  పోలీసులు టార్గెట్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డిజిపి, పోలీసు కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, చిలకలగూడ పోలీసుల అత్యుత్సాహం పై  చర్యలు తీసుకుని జర్నలిజాన్ని రక్షించాలని ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగబద్ధ భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయాలని చూస్తున్నారని, రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో భూతగాదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేలా, ప్రజల మధ్య  వైరుధ్యాలు పెరిగేలా, శాంతిభద్రతలను ప్రజల కోసం కాదు తెరాస పార్టీ నాయకుల కోసమే అన్న పరిస్థితిని సృష్టించి ప్రజల్లో భయాన్ని పుట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి
ఈ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి  పూర్తి వివరణ కోరుతూ 15రోజుల్లో నివేదికను అందించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.