- ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో వెంటనే విభజన
- జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
- ఈ నెల 8 కల్లా సీనియారిటీ లిస్ట్.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని సీనియారిటీ ఆధారంగా విభజన చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా స్థానికతను పరిగణనలోకి తీసుకుని, తమ సొంత జిల్లా లేదా ఆ జిల్లా నుంచి ఏర్పడిన మరో కొత్త జిల్లాను ఎంచుకునే చాన్స్ఇచ్చారు. ఈ మేరకు ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో వెంటనే విభజన ప్రారంభించాలని సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఆర్డర్స్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కోడ్ ముగిసిన తరువాత చేపట్టనున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి డిపార్ట్మెంట్ల వారీగా, జిల్లా పోస్టులు, జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు సీనియారిటీ లిస్ట్ ఫైనల్ చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉద్యోగుల కేటాయింపు కోసం జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా డిపార్ట్మెంట్ల జిల్లా ఆఫీసర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇక జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా శాఖల సెక్రటరీలు, హెచ్వోడీలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త జోనల్ విధానానికి తగ్గట్లు ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర సర్కార్ విధివిధానాలు ఖరారు చేసింది. పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల లిస్ట్ను ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ వోడీలు లిస్ట్తయారు చేస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, ట్రైనింగ్, డెప్యూటేషన్, ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులను కూడా లెక్కలోకి తీసుకుంటారు. కేటాయింపుల తర్వాత వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యూటేషన్, ట్రయినింగ్, ఫారిన్ సర్వీస్లో కొనసాగుతున్నట్టు చూస్తారు.
భార్య, భర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్తే
భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే జిల్లాల కేటాయింపు తరువాత వాళ్లు వేర్వేరు జిల్లాలకు వెళ్లినట్లయితే మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఖాళీల లభ్యతను బట్టి కేటాయింపులో మార్పు చేస్తామన్నారు. అయితే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల బ్యాలెన్స్ కోసం కచ్చితమైన సూచనలను ఆర్డర్స్ లో పేర్కొనలేదు.
మల్టీ జోన్ పోస్టులు ఇట్ల
పాత 5వ జోన్ కేడర్ ఉద్యోగులను మల్టీ జోన్-–1(నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మల్టీ జోన్-–2లోని జనగామ జిల్లాలోని పోస్టులకు కేటాయించడానికి పరిగణలోకి తీసుకుంటారు. పాత 6వ జోన్ కేడర్ ఉద్యోగులను మల్టీ జోన్-2(జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్-–1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టులకు కేటాయించడానికి పరిగణలోకి తీసుకుంటారు. పాత ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మల్టీ జోన్ పోస్టులుగా విభజించారు. ఇలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పాత మల్టీ జోన్ కేడర్ ఉద్యోగులను ఏదైన ఒక కొత్త మల్టీ జోన్కు కేటాయిస్తారు.
జోనల్ కేడర్ ఉద్యోగులకు..
కొత్త జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఖరారు చేసిన ఉద్యోగుల సంఖ్యకు లోబడి పాత జోనల్ కేడర్లోని ఉద్యోగులను కేటాయించడంలో సంబంధిత పాత జోనల్ కేడర్లోని పోస్టులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. పాత 5వ జోన్ కేడర్ ఉద్యోగులను.. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 1 నుంచి 4 జోన్లకు(నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్-5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల కేటాయింపుల కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఇక పాత జోన్-–6 కేడర్ ఉద్యోగులను.. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 5, 6, 7 జోన్లకు(జనగామ జిల్లాలోని పోస్టులను మినహాయించి), జోన్-–2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్-–3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతానికి కేటాయించేందుకు పరిగణలోకి తీసుకుంటారు.
ఈ ఉద్యోగులకు ఇంపార్టెన్స్
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ ప్రకారం వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతంపైగా డిజెబిలిటీ ఉన్న దివ్యాంగులకు, సంతానంలో మనోవైకల్యం ఉన్న ఉద్యోగులు, వితంతువులు, కేన్సర్, నాడులు, కిడ్నీ, గుండె, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. విభజన, కేటాయింపులో అభ్యంతరాలుంటే సంబంధిత డిపార్ట్మెంట్ సెక్రెటరీలకు అప్లికేషన్ పెట్టుకోవాలని సర్కార్ సూచించింది. జోనల్, మల్టీజోనల్కు సంబంధించి ఇవే అంశాలను ప్రస్తావించారు.
‘జిల్లా’ ఉద్యోగుల విభజన ఇట్ల
కొత్త జిల్లాల ప్రకారం నిర్ణయించిన కేడర్ స్ట్రెంథ్కు లోబడి ఉమ్మడి జిల్లాలో పోస్టులన్ని ఆ ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగుల కేటాయింపుల కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎనిమిది జిల్లాలు హన్మకొండ, జయశంకర్- భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి ఒకటికంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాల భూభాగాలతో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల కేడర్ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను పూర్తిగా ఉమ్మడి జిల్లా భూభాగంతో ఏర్పడిన కొత్త జిల్లాలకే కాకుండా కొంత ఆ ఉమ్మడి జిల్లా భూభాగం కలవడంతో పక్కన ఏర్పడిన కొత్త జిల్లాలకు కూడా పోస్టుల లభ్యతకు లోబడి ఉద్యోగుల కేటాయింపులు చేస్తారు.