టికెట్ బుక్ చేసి.. వెంటనే క్యాన్సిల్ చేసి..రూ.3 కోట్లు కొట్టేశారు

టికెట్  బుక్ చేసి.. వెంటనే క్యాన్సిల్  చేసి..రూ.3 కోట్లు కొట్టేశారు
  • ఓ ట్రావెల్​ కంపెనీ డిజిటల్ ​వ్యాలెట్​నుంచి కొల్లగొట్టిన సైబర్​ నేరగాళ్లు
  • 3 నెలల్లో కోట్లలో చీటింగ్​
  • ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ ​పోలీసులు
  • మరో 9 సైబర్ ​కేసుల్లో 15 మంది అదుపులోకి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: టెక్నాలజీని ఆసరాగా చేసుకొని సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సాఫ్ట్ వేర్​లో లోపాన్ని గుర్తించి ఓ ట్రావెల్ ​కంపెనీ డిజిటల్​వ్యాలెట్ ​నుంచి ఏకంగా 3 కోట్లు కొట్టేశారు. 3 నెలల్లోనే కోట్లలో చీటింగ్​ చేసిన ఈ ముఠా చివరకు సైబరాబాద్​ పోలీసులకు చిక్కింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి 28 వరకు 10 సైబర్ నేరాలను ఛేదించి, దేశవ్యాప్తంగా 20 మంది నిందితులను అరెస్టు చేశారు.

 ఈ ఆపరేషన్‌లో ట్రేడింగ్ ఫ్రాడ్స్​తో సంబంధం ఉన్న 14 మంది నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుల్లో ఐదుగురు ఓ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ ​వ్యాలెట్​ సాఫ్ట్​వేర్‌‌లో బగ్​ను ​కనిపెట్టి.. టికెట్​బుక్​ చేసి రీఫండ్​ పేరిట రూ.3 కోట్లు కొట్టేసినట్టు పోలీసులు గుర్తించారు. 

సాఫ్ట్​వేర్‌‌లో బగ్స్​ కనిపెట్టి..

దక్షిణాది రాష్ట్రాల్లో బస్సులు తిప్పుతున్న ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ టికెట్​బుకింగ్ ​కోసం ఓ సాఫ్ట్ వేర్​రన్ ​చేస్తున్నది. ఇందులోనే సదరు కంపెనీ డిజిటల్​వ్యాలెట్ ​కూడా ఉంది. దీనిపై కన్నేసిన సైబర్​ నేరగాళ్లు అందులో లోపాన్ని కనుగొన్నారు. ఈ ఏడాది మే  నుంచి జులై మధ్య కాలంలో తమ పని కానిచ్చారు. ముందు వ్యాలెట్‌లో మనీ లోడ్​ చేసుకొని, తర్వాత టికెట్​బుక్​ చేసుకునేవారు.

 సెకన్లలోనే ఆ టికెట్‌ను క్యాన్సిల్​ చేయడంతో వ్యాలెట్ ​నుంచి డబ్బులు కట్​కాకపోయేవి. అలాగే, టికెట్​ బుక్​ అయినట్టు, క్యాన్సిల్​ అయినట్టు మెసేజ్​వచ్చి టికెట్ ​బుక్ ​చేసిన మొత్తానికి రీఫండ్ ​వ్యాలెట్‌లో క్రెడిట్​అయ్యేది. ఈ ప్రక్రియను పదేపదే రిపీట్​ చేసిన మోసగాళ్లు సదరు కంపెనీ నుంచి పలు దఫాలుగా రూ.3,00,91,683 తమ అకౌంట్లలోకి  ట్రాన్స్​ఫర్ ​చేసుకున్నారు. కస్టమర్ల కోసం కూడా బుకింగ్స్​ చేసి వ్యాలెట్‌లో రీఫండ్​ పొందినట్టు తెలిసింది. వీరికి కొంతమంది సంస్థ ఏజెంట్లు కూడా సహకరించారు.  

పొంతన కుదరకపోవడంతో..

కంపెనీలో బుక్​చేసిన టికెట్లు, వచ్చిన డబ్బులకు సరిపోకపోవడంతో సదరు సంస్థ ఇంటర్నల్​ఆడిట్​నిర్వహించింది. డిజిటల్ వ్యాలెట్ రీఫండ్ సిస్టమ్‌లో ఒక టెక్నికల్​ఎర్రర్‌‌ను కొంతమంది యూజర్లు ఉపయోగించుకున్నారని, వీరికి తమ కంపెనీ ఏజెంట్లు సహకరించారని తెలిసింది. అన్ని ఆధారాలతో సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో కేసులో ప్రధాన నిందితులైన చెన్నుపాటి శివన్నారాయణ,  కడలి నారాయణస్వామి,  అనుగుల రాజ్‌కుమార్, జడ్డ బ్రహ్మయ్య,  పెరిచెర్ల వర్మను పోలీసులు అరెస్ట్​ చేశారు. వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్‌ మెయింటెయిన్ ​చేస్తున్న వారు రెగ్యులర్‌‌గా సాఫ్ట్​వేర్ ​ఆడిట్ చేసుకోవాలని సూచించారు.