- కోడ్ ఎఫెక్ట్తో మరింత కఠినంగా రూల్స్
- ఈవెంట్స్లో లిక్కర్ సప్లైకి ఎక్సైజ్ పర్మిషన్ తప్పనిసరి
- ఎలక్షన్స్తో సంబంధం లేదని బాండ్ పేపర్ రాసివ్వాలె
హైదరాబాద్, వెలుగు:వివాహాలు, శుభకార్యాలపై ఎలక్షన్ కోడ్ ప్రభావం చూపుతున్నది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా లిక్కర్ పార్టీలను నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది. రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్లో పెండ్లి, ఫ్యామిలీ ఫంక్షన్స్, గెట్ టు గెదర్ నిర్వహించే వారి వద్ద ఎక్సైజ్ అధికారులు రూ.100 బాండ్ పేపర్తో అండర్ టేకింగ్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు, ఎలక్షన్స్కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని బాండ్ రాయించుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పార్టీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
మందు సప్లైకి పర్మిషన్ తప్పనిసరి
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లా సహా గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలలో లిక్కర్ సప్లయ్ స్టేటస్ సింబల్గా మారింది. విందులో లిక్కర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఫంక్షన్ హాల్లోనే బార్ తరహా టేబుల్స్, మందు, వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఏర్పాటు చేస్తారు. టేబుల్స్ వారిగా ఫుల్ బాటిల్స్ అందిస్తుంటారు. ఇందుకోసం స్థానిక ఎక్సైజ్ పోలీసుల అనుమతి తప్పనిసరి. ఈవెంట్స్లో లిక్కర్ సప్లయ్ చేయాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఈవెంట్ నిర్వహించే వారి పూర్తి వివరాలతో సంబంధిత డాక్యుమెంట్స్ అందించాలి. జీహెచ్ఎమ్సీ పరిధిలో రూ.12వేలు, శివారు ప్రాంతాల్లో రూ.9వేలు చెల్లించి అనుమతి తీసుకోవాలి.
బాండ్ రాసివ్వాలె
ఎలక్షన్ కోడ్ అమలులోకి రాకముందు అండర్ టేకింగ్ లేకపోయినా అనుమతులు ఇచ్చే వారు. కానీ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నిబంధనలు కఠినతరం చేశారు. రూ.100 బాండ్ పేపర్పై అండర్ టేకింగ్ తప్పని సరి చేశారు. పర్మిషన్స్ కోసం అప్లయ్ చేసుకున్న వారికి ముందస్తు సమాచారం అందిస్తున్నారు. ఎంగేజ్మెంట్స్, ఫ్యామిలీ గెట్ టు గెదర్ సహా లిక్కర్ సప్లయ్ చేసే ప్రతి ఈవెంట్కు సంబంధిత వ్యక్తుల వద్ద బాండ్ పేపర్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు,నాయకులు,ఎలక్షన్స్కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదని అండర్ టేకింగ్ తీసుకుంటున్నారు.