
- అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
- సెక్రటేరియెట్లో అటవీశాఖ ఆఫీసర్లతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు : ఈసారి వన మహోత్సవాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం ఆమె సెక్రటేరియెట్ లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ, ఇతర శాఖ అధికారులు సమన్వయం చేసుకుని జూన్ మొదటివారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవంలో పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలన్నారు.
అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా..19.04 కోట్ల మొక్కలు నాట్టామని.. 95 శాతం మేరకు అంచనాలు రీచ్ అయినట్లు గుర్తుచేశారు. ఈసారి 100 శాతం లక్ష్యం సాధించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు.
ఇంటింటికీ మొక్కలు
ఇంటింటికీ మొక్కలు పంపిణీ జరిగేలా ప్లాన్ రెడీచేయాలని అధికారులను సీతక్క కోరారు. గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతోపాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను ఇండ్ల ఆవరణలో పెంచేందుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పూల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు.