5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరగాలి : మంత్రి తుమ్మల

5 లక్షల ఎకరాల్లో  ఆయిల్పామ్ సాగు జరగాలి : మంత్రి తుమ్మల
  • ఆయిల్ ఫెడ్​పై సమీక్షలో అధికారులకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని అధికారులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్​లోని పరిశ్రమల భవన్​లో ఆయిల్ ఫెడ్  కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తుమ్మల మాట్లాడుతూ జులై నాటికి నర్మెట్ట ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. 

రైతులు లాభాలు గడించేలా నిబద్ధతతో పని చేయాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్​ నర్సరీ స్థాయిలోనే మొక్కలను గుర్తించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులకు అంతర పంటల విషయంలో అవగాహన కల్పించాలన్నారు. 

దీని కోసం అగ్రికల్చర్, హార్టికల్చర్​ శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలన్నారు. సంస్థకు సంబంధించి అన్ని విభాగాలకు తగిన సాంకేతిక సిబ్బందిని నియమించాలన్నారు. దీనికి  ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయిల్ ఫెడ్  ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి  సంస్థను ప్రగతి పథంలో నడిపించాలని మంత్రి తుమ్మల సూచించారు.