
- ఆయిల్ ఫెడ్పై సమీక్షలో అధికారులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని అధికారులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని పరిశ్రమల భవన్లో ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తుమ్మల మాట్లాడుతూ జులై నాటికి నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
రైతులు లాభాలు గడించేలా నిబద్ధతతో పని చేయాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ నర్సరీ స్థాయిలోనే మొక్కలను గుర్తించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులకు అంతర పంటల విషయంలో అవగాహన కల్పించాలన్నారు.
దీని కోసం అగ్రికల్చర్, హార్టికల్చర్ శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలన్నారు. సంస్థకు సంబంధించి అన్ని విభాగాలకు తగిన సాంకేతిక సిబ్బందిని నియమించాలన్నారు. దీనికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి సంస్థను ప్రగతి పథంలో నడిపించాలని మంత్రి తుమ్మల సూచించారు.