- చందానగర్ హత్య కేసులో
- దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: చందానగర్ లాడ్జిలో మృతి చెందిన నర్స్ నాగచైతన్య(24) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియుడే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పథకం ప్రకారమే కోటిరెడ్డి తమ కూతురును హత్య చేశాడని నాగచైతన్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రకాశం జిల్లా కరవాదికి చెందిన గొర్రెమంచు శ్రీనివాస్రావు కూతురు నాగచైతన్య(24) నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి హైదరాబాద్లో మెడికల్ రిప్రజంటేటివ్గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కులాంతర వివాహం కావడంతో పెద్దలు అంగీకరించలేదని తెలిసింది. ఈ క్రమంలో నాగచైతన్యతో మాట్లాడేందుకు కోటిరెడ్డి శనివారం చందానగర్లోని ఓయో లాడ్జికి వచ్చాడు. ఆదివారం రాత్రి వరకు రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉండడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. రూమ్లో గొంతు కోసి పడివున్న నాగచైతన్యను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోటిరెడ్డి కనిపించకోవడంతో పోలీసులు సెర్చ్ చేశారు. ఒంటిపై గాయాలతో ఒంగోలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. నాగచైతన్యను హత్య చేసి పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ అయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కోటిరెడ్డిని విచారించేందుకు చందానగర్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులతో కలిసి కోటిరెడ్డి వివరాలు సేకరిస్తున్నారు.