ఆపద వచ్చినప్పుడు రాజకీయాలుండవు

ఆపద వచ్చినప్పుడు రాజకీయాలుండవు
  • డి.శ్రీనివాస్‌ను పరామర్శించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆపద వచ్చినప్పుడు రాజకీయాలుండవని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను గురువారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. డి శ్రీనివాస్ ని కలవడం కేవలం మర్యాద పూర్వకమేనని, డీఎస్ కిందపడి చెయ్యి విరిగిందని తెలిసి నలకరించేందుకు వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు. డి శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మనిషి అందుకే పలకరింపునకు వచ్చానని, ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ నేను కిందపడితే చేతికి దెబ్బ తగిలింది, ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి నన్ను పలకరించటానికి ఇంటికి వచ్చాడని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. వయస్సులో తనకన్నా చిన్నవాడైనా.... నేను కింద పడ్డానని తెలిసి రేవంత్ వచ్చాడని, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించేందుకు నా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

కాగా సీనియర్ నేత అయిన డి.శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతున్న విషయం బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డీఎస్ నివాసానికి వెళ్లి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో  ప్రాధాన్యత సంతరించుకుంది.