- డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు
- స్విగ్గీ ఆర్డర్లలో ఇదే టాప్, తర్వాతి ప్లేస్లో పీజా, బర్గర్లు
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు వెల్లువెత్తాయి. అందులో మెజార్టీ జనాలు బిర్యానీకే జై కొట్టారు. ఫుడ్ డెలివరీ యాప్లలో టాప్ ఆర్డర్స్ అందుకున్న ఐటమ్గా బిర్యానీ రికార్డుకెక్కింది. బుధవారం సాయంత్రం 7.30 గంటల సమయానికి ఒక్క స్విగ్గీలోనే రికార్డు రేంజ్లో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ చేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల మధ్య స్విగ్గీ నిమిషానికి సగటున1,336 బిర్యానీలను డెలివరీ చేసింది. దేశవ్యాప్తంగా 2025 మొత్తం ఏడాదిలో 9.30 కోట్ల బిర్యానీలు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీల్లో పిజ్జా, బర్గర్లు కూడా బిర్యానీకి గట్టి పోటీ ఇచ్చాయి. స్విగ్గీ డేటా ప్రకారం డిసెంబర్ థర్టీఫస్ట్ రాత్రి 8.30 కల్లా 2.10 లక్షల మంది పిజ్జాలు ఆర్డర్ చేశారు. అదే సమయంలో 2.16 లక్షలకుపైగా బర్గర్లకు ఆర్డర్స్ వచ్చాయి. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఎక్కువ మంది యూజర్లు స్వీట్లు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. రసమలై, గజర్ హల్వా, గులాబ్జామూన్ వంటి స్వీట్లకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలోనూ ప్రజలు నిత్యావసర వస్తువులు, ఫోన్లను కూడా భారీగా కొనుగోలు చేశారు.
గ్రేప్స్.. టాప్ ట్రెండింగ్
మెజార్టీ ప్రజలు బిర్యానీలు, పిజ్జా బర్గర్లతోనే ఆగిపోకుండా ఈ సారి గ్రేప్స్ను కూడా ట్రెండింగ్లోకి తెచ్చారు. డిసెంబర్ 31న ఉదయం నుంచి రాత్రిలోగా ద్రాక్షపండ్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ‘12 గ్రేప్స్ ట్రెండ్’ అనే స్పానిష్ సంప్రదాయం గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. అంటే, అర్ధరాత్రి 12 గంటలకు ముందు 12 గ్రేప్స్ తింటే వచ్చే ఏడాదంతా కలిసొస్తుందని నమ్మకం. ఈ ట్రెండ్ వర్కవుట్ కావడంతో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి యాప్లకు గ్రేప్స్ ఆర్డర్స్ పోటెత్తాయి. మొత్తానికి బుధవారంనాడు సాధారణం కంటే15 రెట్లు ఎక్కువగా ద్రాక్ష పండ్లు అమ్ముడయ్యాయి.
