- హైదరాబాద్లో 50 వేల మందికి పైగా వ్యాక్సినేషన్ సమస్య
- టీకా తీసుకోనోళ్లకు తీసుకున్నట్లు మెసేజ్లు
- రెండు డోసులు కంప్లీట్ అయినా.. అందని సర్టిఫికెట్లు
- ఆఫీసర్ల నిర్లక్ష్యంతో నగరవాసుల ఇబ్బందులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొందరికి సర్టిఫికెట్లు రావడం లేదు. వ్యాక్సినేషన్ టైంలో ఆఫీసర్లు సరిగా రిజిస్ట్రేషన్లు చేయకపోవడం సర్టిఫికెట్లు రాకా జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే సమస్యతో ఫస్ట్ డోస్ వేసుకున్న కొందరికి సెకండ్డోస్కు మెసేజ్లు రావడం లేదు. దీంతో వారు మూడు, నాలుగు నెలలు పూర్తయినా సెకండ్ డోసు వేసుకోలేకపోతున్నారు. మరికొందరికి సెకండ్ డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఇలా గ్రేటర్లో దాదాపు50 వేల మంది వ్యాక్సినేషన్ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి మాల్స్, హోటళ్లు, పార్కులు, థియేటర్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చేవారికి వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అలా చేస్తే సర్టిఫికెట్ రాని వల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా అందరికీ వ్యాక్సిన్ వేయడం లేదు. కొన్ని చోట్ల సెంటర్లు ఎక్కడ పెడుతున్నారో కూడా జనానికి తెలియడం లేదు.
బల్దియా తొందరపాటుతోనే..
జీహెచ్ఎంసీ మూడు నెలల క్రితం నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో రోజూ 20 నుంచి 30 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే ఆ సమయంలో ఒక్కో సెంటర్కి వేలాది మంది తరలి రావడంతో వ్యాక్సిన్ వేయాలనే తొందరపాటులో కొందరికి రిజిస్ర్టేషన్లు చేయకుండానే టీకా ఇచ్చారు. సర్వర్ డౌన్ ఉందని తరువాత మెసేజ్ వస్తుందని అప్పట్లో చెప్పినప్పటికీ ఇంకా మెసేజ్లు రాలేదు. ఇప్పుడు మూడునెలలు పూర్తవడంతో సెకండ్ డోసు ఎలా వేసుకోవాలని జనం ఆందోళన చెందుతున్నారు.
24 కాలనీల్లో పూర్తయితే వంద శాతం
గ్రేటర్పరిధిలో 4,846 కాలనీలు ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ఈ నెల 9వ తేదీ వరకు 4,822 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రకటించింది. అంటే 24 కాలనీల్లో వ్యాక్సిన్లు వేస్తే గ్రేటర్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రకటించనుంది. కానీ గ్రౌండ్ లెవల్లో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు సర్టిఫికెట్లు రాకపోతుండగా, వ్యాక్సిన్ తీసుకోని వారికి తీసుకున్నట్లు మెసెజ్లు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్తోనే ఈ గందర గోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.