IND vs PAK: భారత్ కనీసం 15 ఓవర్లు కూడా ఆడదు.. టీమిండియాపై పాక్ క్రికెటర్ బలుపు మాటలు!

IND vs PAK: భారత్ కనీసం 15 ఓవర్లు కూడా ఆడదు.. టీమిండియాపై పాక్ క్రికెటర్ బలుపు మాటలు!

IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. కాసేపట్లో కొలంబోలో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తో  టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ కి ముందు పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మీడియాతో ఇమాద్ వసీం మాట్లాడుతూ.. ఈ పరిస్థితుల్లో భారత్ 15 ఓవర్లు కూడా క్రీజులో నిలబడదనుకుంటా.. 170– 180 పరుగులు చేయడం అసాధ్యం.. కొలంబో పెద్ద మైదానం కావడంతో బ్యాటర్లు నిలబడి స్వేచ్ఛగా షాట్లు ఆడలేరు అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య డిబేట్‌గా మారింది. కొలంబోలో జరుగుతున్న భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు ఈ మాటలను తప్పు అని నిరూపించబోతున్నారు? భారత్ బ్యాటర్లా? లేక పాకిస్తాన్ బౌలర్లా? అన్న ప్రశ్నను నెట్టింట సంధిస్తున్నారు. కొలంబో మైదానం పెద్దదిగా ఉండటంతో బౌండరీలు కొట్టడం అంత సులువు కాదు.. పైగా పిచ్ నెమ్మదిగా ఉండటం, స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ పరుగులు రాబట్టడం బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది. ఈ పరిస్థితుల్లో భారత్ దూకుడుగా ఆడితే తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ALSO READ : భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌ చూసేందుకు శ్రీలంకకు రోహిత్ శర్మ..?

మరోవైపు, భారత జట్టులో ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. ఒత్తిడిలోనూ క్రీజులో నిలబడి ఆడగలిగే సామర్థ్యం వాళ్లకి ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తెలివిగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ సాధించవచ్చని సోషల్ మీడియాలో అభిమానులు సూచిస్తున్నారు. దీంతో కొలంబోలో కాసేపట్లో జరిగే భారత్– పాకిస్తాన్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా వేచి చూస్తున్నారు.