అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న సీఐ నాగేశ్వరరావు సర్వీస్ రివాల్వర్ ను వనస్థలిపురం పోలీసులు సీజ్ చేశారు. బాధితులు, సాక్షులు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సీసీటీవీ పుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు.
అసలు కేసు ఏంటీ..?
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బెదిరించి..అతని భార్యను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2018లో నమోదైన ఓ కేసులో వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న సీఐ నాగేశ్వరరావు.. నిందితుడికి బెయిల్ వచ్చాక తన పొలంలో పనికి పెట్టుకున్నాడు. అతను, తన భార్యతో కలిసి నాగేశ్వర్రావుకి చెందిన పొలంలో పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో లేని సమయం చూసి.. అతని భార్యను ఇబ్రహీంపట్నంలోని ఫామ్హౌస్కు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
గంజాయి కేసు పెడతామని బెదిరింపు
విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త నాగేశ్వరరావుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోకపోతే నాగేశ్వర్ రావు భార్యకు చెప్తానని హెచ్చరించాడు. విషయం తన భార్యకు తెలుస్తుందేమోనని భయపడిన నాగేశ్వర్ రావు.. బాధిత దంపతులను బతిమిలాడుకున్నాడు. మరోసారి అలా ప్రవర్తించనని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు బాధితుని టాస్క్పోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టారు. గంజాయి ప్యాకెట్స్ చేతిలో పెట్టి ఫొటోలు..వీడియోస్ తీశారు. నాగేశ్వర్రావుకు సంబంధించిన విషయాలు ఆయన భార్యకు చెప్తే గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
నేరుగా ఇంటికి వెళ్లి అఘాయిత్యం
నిందితుడు సొంత ఊరికి వెళ్లాడని తెలిసి..ఈ నెల 6వ తేదీన బాధితురాలికి నాగేశ్వర రావు మరోసారి వాట్సాప్ కాల్ చేసి..అసభ్యకరంగా మాట్లాడాడు. తన లైంగిక కోర్కెలు తీర్చాలని బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెపై దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. భార్య ఏడుపులు విని డోర్స్ పగులగొట్టి ఇంట్లోకి వచ్చాడు. నాగేశ్వర్రావుపై కర్రతో దాడి చేశాడు. దాంతో సీఐ రివాల్వర్ ను బయటకు తీశాడు. చెప్పినట్లు వినకుంటే బ్రోతల్ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ వెహికిల్లో ఎక్కించి.. వనస్థలిపురం నుంచి ఇబ్రహింపట్నానికి బయలుదేరాడు. కారు వెనుక సీట్లో బాధితురాలు కూర్చోగా..ఆమె ముందు సీట్లో నాగేశ్వర్రావు కూర్చున్నాడు. బాధితురాలి భర్తను డ్రైవ్ చేయాలని గన్పెట్టాడు. మార్గ మధ్యలో ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం వచ్చారు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
