నేనేం దొంగను కాదు దేశం నుంచి పారిపోయానంతే: విజయ్ మాల్యా

నేనేం దొంగను కాదు  దేశం నుంచి పారిపోయానంతే: విజయ్ మాల్యా

న్యూఢిల్లీ: దేశం వదిలి పారిపోయానంటే ఒప్పుకుంటా కానీ తాను  దొంగను కాదని విజయ్ మాల్యా చెప్పారు. బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌‌‌‌ మాల్యా.. ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్ రాజ్‌‌‌‌ శమానీతో పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో మాట్లాడారు. ‘‘నిజానికి నేనేం దేశం నుంచి పారిపోలేదు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే 2016 మార్చిలో విదేశాలకు వచ్చాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇండియాకు తిరిగి రాలే.  ఇండియా రానందుకు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి. కానీ దొంగ అని ఎందుకు అంటున్నారు. నేనేం దొంగతనం చేశాను?” అని ప్రశ్నించారు. న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇస్తే ఇండియాకు తిరిగివచ్చే విషయంపై తప్పకుండా ఆలోచిస్తానని తెలిపారు.

అందుకే కింగ్‌‌‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ మూత..

కింగ్‌‌‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ సంస్థ మూతపడడానికి 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభమే కారణమని విజయ్‌‌‌‌మాల్యా తెలిపారు. ‘‘2008 వరకు కింగ్‌‌‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్​ ఇబ్బందుల్లేకుండా నడిచింది. కానీ ఆ తర్వాత తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో భారత్‌‌‌‌లోని ప్రతి సెక్టార్ దెబ్బతిన్నది. ఆ టైమ్‌‌‌‌లో నేను అప్పటి సెంట్రల్ ఫైనాన్స్‌‌‌‌ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్లాను. ఇలాంటి పరిస్థితుల్లో కింగ్‌‌‌‌ఫిషర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ను నడపలేనని ఆయనకు చెప్పాను. విమానాలు, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తానని అన్నాను. అయితే ప్రణబ్ అలా చేయొద్దని చెప్పారు. బ్యాంకుల నుంచి సపోర్టు అందజేస్తామన్నారు. ఇక అక్కడి నుంచే అంతా మొదలైంది. బ్యాంకుల నుంచి మద్దతున్నా, నష్టాల వల్ల సంస్థ విమానాలన్నింటినీ బంద్ చేయాల్సి వచ్చింది” అని వివరించారు. కాగా, లోన్లను తిరిగి కట్టాలనే ఉద్దేశంతో తాను బ్యాంకులకు నాలుగుసార్లు సెటిల్‌‌‌‌మెంట్ ఆఫర్ ఇచ్చినప్పటికీ, అవన్నీ తిరస్కరించాయని పేర్కొన్నారు.