ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం
  • మొన్న తాడ్వాయి.. నిన్న మంగపేటలో పశువులపై దాడి

ఏటూరునాగారం, వెలుగు: దట్టమైన అడవులున్న ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట మండలాల్లో మూడు రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సోమవారం తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో పశువుల మంద పైకి దాడికి యత్నించింది. మంగళవారం మంగపేట మండలంలో లేగపై దాడి చేసి చంపింది. మేత కోసం తాడ్వాయి మండలం కామారం అడవికి తోలుకెళ్లిన బర్రెల మందపై సోమవారం పెద్ద పులి దాడికి యత్నించింది. అది చూసిన పశువుల కాపరి పులి రమేశ్ భయంతో కేకలు వేశాడు. దాంతో పులికి అక్కడి నుంచి పారిపోయింది.

అతని ద్వారా సమాచారం అందుకున్న తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా పెద్దపులి కాలి ముద్రలను గుర్తించారు. రైతులు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా మంగళవారం మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం అనుబంధ గ్రామమైన శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెంకు సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో మోట్లగూడెంకు చెందిన బంగారి నాగేశ్​లేగ దూడ మృతి చెందింది. కాపర్ల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్​ ఆఫీసర్లు పెద్దపులి దాడిగా కన్ఫార్మ్​చేశారు. బుధవారం పులి దాడి చేసిన ప్రాంతాల్లో సీసీ కెమెరా ట్రాకర్స్ ఏర్పాటు చేశారు. వరుస ఘటనలతో ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు చోట్ల దాడి చేసింది ఒకటే పులా, లేక రెండు ఉన్నాయా అని భయపడుతున్నారు.