పుణె: గత సీజన్లో చెత్త పెర్ఫామెన్స్తో ఢీలా పడిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–15 కోసం రెడీ అయ్యింది. మంగళవారం జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో పోటీ పడనుంది. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న హైదరాబాద్.. మెగా వేలంలోనూ పెద్ద ఆటగాళ్లపై దృష్టి పెట్టలేదు. దీంతో ఇద్దరు, ముగ్గురు మినహా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ప్లేయర్లతో సన్రైజర్స్ సంచలనాలు చేస్తుందా? అన్నది చూడాలి. కెప్టెన్ కేన్ విలియమ్సనే.. ఇప్పుడున్న టీమ్కు పెద్ద దిక్కు. అతనికి ఉన్న అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం.. సన్ అదృష్టాన్ని మారుస్తుందుమే చూడాలి. గ్లెన్ ఫిలిప్స్ ఓపెనర్గా వచ్చే చాన్స్ ఉంది. మిడిలార్డర్లో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి కీలకం కానున్నారు. గత లీగ్స్లో త్రిపాఠి రాణించినా.. నిలకడలేమి అతని బలహీనత. విలియమ్సన్ మూడో నంబర్లో బ్యాటింగ్కు వస్తే, రవికుమార్ సమర్థ్.. ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. అబ్దుల్ సమద్ను ఫినిషర్గా ఉపయోగించుకోవచ్చు. బౌలింగ్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ పేస్ భారాన్ని మోయనున్నాడు. యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా రాణిస్తే సన్కు తిరుగుండదు. యార్కర్ స్పెషలిస్ట్ టి. నటరాజన్పై అందరి దృష్టి నెలకొంది. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్, సుచిత్ను ట్రై చేసి చూడొచ్చు.
శాంసన్ కీలకం..
మరోవైపు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్పై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రతి ఏడాది ఒకటి, రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినా.. టైటిల్ గెలవాలంటే తను మరింత ఎక్కువగా శ్రమించాలి. ఈ ఐపీఎల్లో రాణిస్తే శాంసన్కు.. టీమిండియా ప్లేస్ కూడా సుస్థిరం అవుతుంది. ఇక రాజస్తాన్ టీమ్లో మ్యాచ్ విన్నర్స్కు కొదువలేదు. జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ ఓపెనర్లుగా రావొచ్చు. ఈ ఇద్దరు కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. పవర్ హిట్టర్ షిమ్రన్ హెట్మయర్, డుసెన్, నీషమ్, రియాన్ పరాగ్.. మిడిలార్డర్లో ఆడనున్నారు. రాజస్తాన్ బౌలింగ్కు తిరుగులేదు. అశ్విన్, చహల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, సైనీతో పేస్ బలం కూడా పెరిగింది.