బోధన్, వెలుగు : పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు దోచుకున్నారు. ఎస్సై మచ్ఛేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని ఊట్ పల్లి గ్రామానికి చెందిన మహిళకు కొద్ది రోజుల కింద గుర్తుతెలియని టెలిగ్రామ్ ద్వారా వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ యాప్లో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ ఇస్తామని నమ్మబలికాడు.
దీంతో అతడి మాటలు నమ్మి విడతల వారీగా రూ.3,06,466 పంపించింది. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఫోన్చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరస్తుడి అకౌంట్లో ఉన్న రూ.38,478 పోలీసులు ఫ్రీజ్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
