మహిళలను కించపరిచే వీడియోలపై విచారణ చేస్తాం

మహిళలను కించపరిచే  వీడియోలపై విచారణ చేస్తాం
  • ఫ్రీ బస్ జర్నీని  అవహేళన చేస్తే ఊరుకోం

  • మహిళా ప్రయాణికులను అవమానిస్తున్నరు

  • రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్


హైదరాబాద్​:  ఆర్టీసి బస్సుల్లో  మహిళల ప్రయాణానికి సంబంధించి సోషల్​ మీడియాతో వస్తున్న వీడియోలపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ  కావాలనే కొన్ని పార్టీలు సోషల్ మీడియా ద్వారా  ఆ వీడియోలను షేర్​ చేస్తున్నాయన్నారు. మహిళలకు  ఫ్రీ జర్నీ స్కీమ్ సక్సెస్ కావడంతో కొంతమందికి మొదటి నుంచి కళ్ల మంట ఉందన్నారు. 

 హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఏమీ తోచక వెల్లిపాయలు పొట్టు తీసుకుంటున్న వీడియోలు వచ్చాయన్నారు.ఫ్రీ జర్నీతో ఆటో కార్మికులకు నష్టం జరుగుతుందని ఆ పార్టీలు  బద్నాం చేస్తున్నాయన్నారు. మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయడం ఇష్టమా లేదా అని ఆయన ప్రశ్నించారు. మహిళా ప్రయాణికులను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 70 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు.  ఏ పనిలేక  మహిళలు  తిరుగుతున్నారని అవమానించే  వీడియోల మీద చర్యలు తీసుకుంటామన్నారు. 

మెట్రోలో 5 లక్షల మంది  వెళ్తున్నారని, అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా అని ప్రశ్నించారు. ఓలా , ఉబర్ తో  ప్రభావం పడలేదా అని నిలదీశారు. ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో దానిపై ప్రభావం పడుతుందన్నారు. ఆ ప్రభావం పడకుండా సూచనలు చేయాలన్నారు. మహిళలను అవహేళన చేసే  వీడియోలను ఎవరు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆ ఘటనలను షూట్​ చేసి పెట్టే  వారిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.