
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 49 మందిపై రూ. 1.06 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్స్, నలుగురు ఏసీఎంలు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు మిలీషియా కమాండర్లు, డిప్యూటీ కమాండర్లు, నలుగురు జనతన సర్కార్ అధ్యక్షులు, 23 మంది మిలీషియా ప్లాటూన్ సభ్యులతో పాటు వివిధ కమిటీలకు చెందిన మెంబర్స్ ఉన్నారని ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద రూ.50 వేల చొప్పున అందజేశారు.
ఇన్ఫార్మర్ల పేరుతో ఇద్దరి హత్య
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పూజారికాంకేర్ గ్రామానికి చెందిన మడకం బీమా ఇంటికి వచ్చిన నలుగురు మావోయిస్టులు అతడిని బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల ముందు కత్తులతో పొడిచి హత్య చేశారు.
విషయం తెలుసుకున్న బీజాపూర్ ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నా బలగాల సాయంతో బీమా డెడ్బాడీని సమీప హాస్పిటల్కు తరలించారు. అలాగే కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని సాలాతోంగ్ గ్రామానికి చెందిన రవ్వా సోను (65) అనే వృద్ధుడిని కూడా గ్రామస్తుల సమక్షంలోనే కర్రలతో కొట్టి హత్య చేశారు.