న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ గ్రూప్–1 తొలి పోరులో 76 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఇండియా చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తిగా తేలిపోయిన సూర్యకుమార్ సేన ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో భారత ఓటమికి గల కారణాలపై టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ హాట్ కామెంట్స్ చేశాడు.
సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచులో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేయడం బిగ్ మిస్టేక్ అని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2024 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఛేజింగ్లో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గుర్తు చేశాడు.
ఆ మ్యాచులో అక్షర్ పటేల్ పాత్రను మరిచిపోవద్దన్నారు. వాషింగ్టన్ సుందర్ సామర్ధ్యాన్ని తక్కువ చేయడం లేదు కానీ ఐసీసీ వంటి మెగా టోర్నీలో అతడి స్థానంలో అక్షర్ పటేల్ ఎంపిక భారత్కు బెస్ట్ ఛాయిస్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అలాగే.. పవర్ హిట్టర్ రింకు సింగ్ను 8వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం కూడా సరికాదన్నాడు. క్రికెట్ ఫాన్స్ అశ్విన్ వాదనను సమర్ధిస్తున్నారు. ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను పక్కకు పెట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించడం కూడా ఇండియా ఓటమికి ఒక కారణమంటున్నారు.
ఇండియా ఘోర ఓటమి:
లీగ్ దశలో చిన్న జట్లపై బ్యాటింగ్లో తడబడిన టీమిండియా కీలకమైన సూపర్–8 రౌండ్ ఆరంభంలోనే చతికిలపడింది. పేరున్న బ్యాటర్లంతా పేలవ ఆటతో నిరాశపరచడంతో ఆదివారం జరిగిన గ్రూప్–1 తొలి పోరులో 76 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
డేవిడ్ మిల్లర్ (35 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63)కు తోడు డెవాల్డ్ బ్రెవిస్ (29 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్ (24 బాల్స్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 నాటౌట్) దంచికొట్టడంతో తొలుత సఫారీ టీమ్ 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. బుమ్రా (3/15) మూడు, అర్ష్దీప్ సింగ్ (2/28) రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు.
అనంతరం ఛేజింగ్లో ఇండియా 18.5 ఓవర్లలో 111 రన్స్కే కుప్పకూలింది. శివమ్ దూబే (37 బాల్స్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 42) ఒక్కడే పోరాడాడు. సఫారీ బౌలర్లలో యాన్సెన్ (4/22), కేశవ్ మహారాజ్ (3/24), కార్బిన్ బాష్ (2/12) దెబ్బకొట్టారు. మిల్లర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్లో జింబాబ్వేతో ఇండియా పోటీ పడనుంది.
