అస్సాం, వెలుగు: వరదలతో అల్లాడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు తన జీవితకాలపు పొదుపును ధారపోశారు ఓ వృద్ధురాలు. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా మజ్రోయిమరి గ్రామానికి చెందిన 103 ఏండ్ల కనకలతా దాస్ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. శివసాగర్ జిల్లా అమ్గురి గార్డెన్ ప్రాంతంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె తెలుసుకున్నారు.
తన స్వశక్తితో కూడబెట్టిన పొదుపు సొమ్మును అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె శివసాగర్ జిల్లా కలెక్టరేట్కు వెళ్లి, వరదలతో నష్టపోయిన 77 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
