భారీ వర్షాలకు గోడ కూలి 11 మంది మృతి

భారీ వర్షాలకు గోడ కూలి 11 మంది మృతి
  • పాకిస్తాన్​లో ఘటన

ఇస్లామాబాద్: భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్​లో 11 మంది మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇస్లామాబాద్‌లోని పెషావర్ రోడ్​ ఏరియాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారంతా భవన నిర్మాణ కూలీలేనని గుర్తించారు. వారంతా అండర్‌పాస్ నిర్మాణంలో పనిచేస్తున్నారని, కార్మికులు వేసుకున్న టెంట్‌పై గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఇర్ఫాన్ నవాజ్ మెమన్ తెలిపారు. 

శిథిలాల నుంచి డెడ్​బాడీలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని, వారి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.