- ఇద్దరు జవాన్లకు గాయాలు కొనసాగుతున్న కూంబింగ్
- బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఎస్పీల పర్యవేక్షణలో జాయింట్ ఆపరేషన్
- దండకారణ్యంలో టెన్షన్ టెన్షన్
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ అడవుల్లో సమావేశమైన మావోయిస్టులను బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి వెళ్లిన ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు శుక్రవారం ఉదయం చుట్టుముట్టాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విడతల వారీగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బస్తర్ డీజీఐ కమలోచన్ కశ్యప్ ఆధ్వర్యంలో బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్, సుక్మా ఎస్పీ కిరణ్ కుమార్ చౌహాన్ల పర్యవేక్షణలో సుమారు 12 వందల మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. బలగాలు ఇంకా అడవుల్లోనే ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మాటువేసి మట్టుబెట్టారు
దక్షిణ బస్తర్ దండకారణ్యంలోని మావోయిస్టు అగ్రనేతలు కమాండర్ లింగా, పాపారావు, దక్షిణ బస్తర్ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ లీడర్లు పిడియా అడవుల్లో సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో దక్షిణ బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్.. బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఎస్పీలను అప్రమత్తం చేశారు. డీఆర్జీ (డిస్ట్రిక్ట్ ఆర్డ్మ్ గార్డ్), ఎస్టీఎఫ్(స్పెషల్ టాస్క్ ఫోర్స్), సీఆర్పీఎఫ్ 210 బెటాలియన్కు చెందిన 1,200 మంది మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు సమావేశమైన ప్రాంతానికి జవాన్లు చేరుకున్నారు. వారి రాకను గమనించిన మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు సమావేశ ప్రాంగణాన్ని రౌండప్ చేసి కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా బలగాలు వారిని వెంటాడడంతో సాయంత్రం వరకు పలు దఫాల్లో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు,ఇతర నిత్యావసర సరుకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చీకటి పడడంతో బలగాలు దట్టమైన అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాకప్ బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. పిడియా అడవులు మొత్తం బలగాల ఆధీనంలోనే ఉన్నాయి. తప్పించుకుపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నారని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుదాడులకు దిగే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు నెలల్లో మూడో పెద్ద ఆపరేషన్
ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు నిర్వహించిన జవాన్లు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవలే కాంకేర్ జిల్లాలో 29 మందిని, నారాయణ్పూర్లో 10 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా 12 మందిని మట్టుబెట్టారు. నాలుగు నెలల కాలంలో 99 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని దక్షిణ బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్ మీడియాకు తెలిపారు.
