గుర్తించి కాపాడిన మత్స్యకారులు
సూరత్: సముద్రంలో గల్లంతైన 14 ఏండ్ల బాలుడు.. ఓ చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అలా నడి సముద్రంలో ఒకరోజుకుపైగా ఎదురుచూశాడు. మరుసటిరోజు అటుగా మత్స్య కారుల బోటు రావడంతో వాళ్ల సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేరాడు. గుజరాత్లోని సూరత్లో సోమవారం ఈ ఘటన జరిగింది. సూరత్కు చెందిన లఖన్ దేవిపూజక్(14) తన స్నేహితులతో కలిసి గత ఆదివారం మధ్యాహ్నం డుమాస్లోని బీచ్కు వెళ్లాడు.
అక్కడ ప్రమాదవశాత్తు లఖన్ అలల్లో కొట్టుకుపోయాడు. స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా పిల్లాడి ఆచూకీ దొరకలేదు. డుమాస్ పోలీసులు కూడా బాలుడిని కనిపెట్టలేకపోయారు. మరుసటిరోజు సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటును గమనించి లఖన్ కేకలు వేశాడు.
దీంతో వాళ్లు.. అతనిని బోటులో ఎక్కించుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గణపతి విగ్రహాలకు వాడే చెక్కను పట్టుకుని నీళ్లలో వేలాడుతున్న లఖన్ ను చూసి తాము ఆశ్చర్యపోయామని మత్స్యకారులు తెలిపారు.