
నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో వందలాది మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఆకస్మిక దాడులు చేసిన హమాస్ తీవ్రవాదులు దాదాపు 900 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేశారు.ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులను మట్టు బెట్టింది.
హామాస్ మిలిటెంట్లను అణచివేయడమే లక్ష్యంగా ఇజ్రాయోల్ సైన్యం గాజాపై వైమానిక దాడులు ఉదృతం చేస్తోంది. తమ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించినట్లు ఇజ్రయెల్ సైన్యం తెలిపింది.
గత రాత్రి నుండి హమాస్ యోధులు ఎవరూ ఇజ్రాయెల్లోకి ప్రవేశించలేదని.. అయితే చొరబాట్లు ఇప్పటికీ సాధ్యమేనని అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గత నాలుగు రోజులుగా హమాస్ తీవ్రవాదులు చేస్తున్న దాడుల్లో 900 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారని.. 30 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు తెలిపాయి.
మరో వైపు హమాస్ తీవ్ర వాద సంస్థ ఇజ్రాయిల్ తో చర్చలకు దిగొచ్చినట్లు తెలుస్తోంది. హమాస్ తీవ్రవాద సంస్థలోని పాలస్తీనా సీనియర్ సభ్యుడు అబు మర్జౌక్ ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.