- అక్టోబర్ 1న ఢిల్లీలో ప్రదానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపికయ్యాయి. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ -2022 అవార్డులను ప్రదానం చేయనుంది. ఆదిబట్ల, బడంగ్పేట్, భూత్పూర్, చండూరు, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు అవార్డులు వచ్చాయి. 2021 జులై నుంచి 2022 జనవరి వరకు పారిశుధ్య నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ ఫ్రీ సిటీ సహా ఇతర అంశాల్లో స్టార్ రేటింగ్ ఇచ్చి ఈ అవార్డులకు ఎంపిక చేశారు. దేశంలోని 4,355 పట్టణాలు ఈ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 మున్సిపాలిటీలను ఓడీఎఫ్ ప్లస్గా, 40 పట్టణాలను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్గా, ఒక పట్టణాన్ని వాటర్ ప్లస్ సిటీగా, 31 మున్సిపాలిటీలను ఓడీఎఫ్ సిటీలుగా గుర్తించింది.
ప్రభుత్వ చర్యలతోనే అవార్డులు: మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలతోనే రాష్ట్రానికి వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, గ్రీనరీ పెంచడం, నర్సరీల ఏర్పాటుతో వేగంగా మార్పులు వచ్చాయని చెప్పారు.