
మంచిర్యాల జిల్లా: జైపూర్ తెలంగాణ సంక్షేమ బాలుర పాఠశాలలో నిన్న రాత్రి పెట్టిన భోజనం కొందరు విద్యార్థులకు వికటించింది. రాత్రి అన్నం తిన్న కాసేపటికే కడుపు నొప్పి అంటూ.. 16 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా నీరసించిపోవడంతో సెలైన్ ఎక్కించారు. ఇప్పుడు విద్యార్థులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడం కలకలం రేపింది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఆరా తీయడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై వంటకు ఉపయోగించిన ఆహార పదార్థాలను పరిశీలించారు.