ఫ్రాన్స్ లో జూన్ 27న జరిగిన ఓ ఘటన ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. అదే 17 ఏళ్ల యువకుడి మృతి. జూన్ 27న నహెల్అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. దీంతో ఒక్క సారిగా దేశమంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పౌరులు విధ్వంసాలకు పాల్పడుతూ.. ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇదీ నహెల్ కుటుంబం బ్యాగ్రౌండ్..
కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికాలోని అల్జీరియా నుంచి వలస వచ్చింది. ఇది ఫ్రాన్స్ దురాహంకార వైఖరికి నిదర్శనమని పౌరులు అంటున్నారు. ఇదే ఏడాది మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు ఆరోపణలు వినిపించాయి. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. పారిస్ శివారు నాంటెర్రె వద్ద కాల్పులు జరిపిన పోలీసుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రంగంలోకి బలగాలు..
యువకుడిని కాల్చడం ఫ్రాన్స్ ప్రభుత్వం జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆరోపిస్తూ ఆందోళనకారులు నిరసనలు చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది పోలీసు బలగాలను మోహరించింది. నిరసనకారులు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి దుకాణాలు, కార్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్ డిపో, కార్లకు నిప్పుపెట్టారు.పారిస్లోని ఓ పోలీస్స్టేషన్పై దాడి జరిగింది.
రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్ను దోచుకున్నారు. రంగంలోకి దిగిన బలగాలు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రుళ్లు కర్ఫ్యూ విధిస్తున్నారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది ప్యారిస్ కి చెందినవారేనని అధికారులు తెలిపారు.
మరో వివాదంలో అధ్యక్షుడు..
ఈ ఘటన క్రమంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొనడం వివాదానికి దారి తీసింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్అయినప్పటి నుంచి ఘర్షణలు పెరిగాయి. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ ప్రభుత్వం అధికారులకు సూచించింది.
యువత బయటకు రావొద్దు..
దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లు కంట్రోల్ కావాలంటే యువత బయటకి రావొద్దని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్లు స్నాప్ చాట్, టిక్టాక్ లలో వాటిని తొలగించాలని ప్రభుత్వం కోరింది. యువతను బయటికి రాకుండా తల్లిదండ్రులే చూడాలని విజ్ణప్తి చేశారు ఫ్యాన్స్ అధ్యక్షులు.