న్యూఢిల్లీ: దేశంలోని పెద్ద రిటెయిల్ స్టోర్లు హామ్లేస్, ఆర్చీస్తోపాటు మాల్స్లో గత నెల రోజులలో 18,500 నాసిరకం బొమ్మలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. బీఐఎస్ క్వాలిటీ స్టాండర్డ్స్ను పాటించకపోవడం వల్లే ఈ బొమ్మలను సీజ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, టాయ్స్ కంట్రోల్ ఆర్డరులోని రూల్స్ను పాటించనందుకు ఆన్లైన్ కంపెనీలయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, శ్నాప్డీల్లకు కన్జూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేటర్ సీసీపీఏ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు పాటించడం ఈ ఏడాది జనవరి 1 నుంచి తప్పనిసరని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కొంత మంది దేశీయ తయారీదారులు బొమ్మల తయారీలో ప్రమాణాలు పాటించడం లేదనే కంప్లెయింట్లు రావడంతో, గత నెల రోజులలో 44 రెయిడ్స్ నిర్వహించినట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన బొమ్మలలో దేశంలో తయారైన వాటితోపాటు, దిగుమతి చేసుకున్నవీ ఉన్నట్లు చెప్పారు. కొన్ని బొమ్మలపై బీఐఎస్ క్వాలిటీ మార్క్ జాడే లేదని పేర్కొన్నారు. మరికొన్నింటిపై ఫేక్ బీఐఎస్ లైసెన్స్ నెంబర్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
పెద్ద రిటెయిలర్లపై ఫోకస్....
దేశంలోని ఎయిర్పోర్టులు, మాల్స్లో ఉన్న హామ్లేస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్, కోకోఆర్ట్ వంటి రిటెయిల్ స్టోర్లపై ఈ రెయిడ్స్ నిర్వహించినట్లు తివారీ వెల్లడించారు. న్యూఢిల్లీ, కోల్కతా, రాంచి, నోయిడా, శాస్ నగర్ (పంజాబ్) లలోని స్టోర్ల నుంచి బొమ్మలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘజియాబాద్లోని పసిఫిక్ మాల్, హైదరాబాద్, ఢిల్లీలలోని డబ్ల్యూహెచ్ స్మిత్ స్టోర్ల నుంచి కూడా నాసిరకం బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అహ్మదాబాద్లోని రాజ్ టాయ్ వరల్డ్ నుంచి ఏకంగా 9 వేల బొమ్మలను సీజ్ చేశారు. మదురైలోని గిఫ్ట్జ్నుంచి 3,080, బెంగళూరులోని రాయల్ మార్ట్ నుంచి 2 వేల బొమ్మలను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని బొమ్మల షాపులపై నిఘా పెట్టామని, దశల వారీగా సోదాలు నిర్వహిస్తామని తివారీ వెల్లడించారు. మొదటి దశలో పెద్ద రిటెయిలర్లు, ఎయిర్పోర్టులు, మాల్స్లోని స్టోర్లపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఆ తర్వాత దశలో చిన్న రిటెయిలర్లు, మాన్యుఫాక్చరర్లపైనా దృష్టిపెట్టనున్నామని అన్నారు. బీఐఎస్ రూల్స్ను పాటించని రిటెయిలర్లపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు చెబుతూ, మొదటిసారి తప్పు చేసినందుకు రూ. లక్ష దాకా పెనాల్టీతోపాటు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని తివారీ చెప్పారు. టాయ్స్ కంట్రోల్ ఆర్డరును పాటిస్తున్నాయా లేదా అనే కోణంలో మరోవైపు ఆన్లైన్ బిజినెస్లపై సెంట్రల్ కన్జూ మర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) దృష్టి సారిస్తోంది. బీఐఎస్ మార్కు లేని బొమ్మలను అమ్ముతున్నందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, శ్నాప్డీల్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు తివారీ వెల్లడించారు. దిగుమతి చేసుకునే బొమ్మలు మన స్టాండర్డ్స్కు తగినట్లుగా ఉన్నాయా లేదా చూసేందుకు కస్టమ్స్ అధికారులతో కలిపి జాయింట్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. దీంతో అలాంటి బొమ్మలు దేశంలోకి రాకుండానే ఆపడం వీలవుతుందని పేర్కొన్నారు. బీఐఎస్ రూల్స్ ప్రకారం ప్రొడక్ట్ డిక్లరేషన్ను తమ ప్లాట్ఫామ్స్లో ఉంచేందుకు ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.