గ్రేటర్లో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజూ30–40 పైనే నమోదవుతున్నయ్. గత వారం330, ఈ వారం 199 పాజిటివ్లు వచ్చాయి. చార్మినార్, మలక్పేట, ఖైరతాబాద్, జియాగూడ, లంగర్హౌస్, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏరియాల్లోనే తీవ్రత ఎక్కువగా ఉంది. కొత్తగా వచ్చే కేసులన్నీ కరోనా ఎఫెక్టెడ్ సమీప ప్రాంతాలే కావడంతో ఆందోళన కలిగిస్తోంది. కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటుతో సరిపెట్టడం వల్లే స్ప్రెడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క జియాగూడ ఏరియాలోనే ఇప్పటివరకు 106 పాజిటివ్ లు వచ్చాయి. ఇక్కడ 26 కంటెయిన్మెంట్జోన్లు పెట్టారు. ఇందిరానగర్, గంగానగర్, కార్వాన్, సబ్జీ మండి, లంగర్ హౌస్, గోల్కొండ ఏరియాలకు వైరస్ విస్తరించింది. పాజిటివ్ వచ్చిన ఇంటినే కంటెయిన్ మెంట్ జోన్గా చేస్తుండడంతో బల్దియా చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. జియాగూడ వంటి ఏరియాలో మొక్కుబడి చర్యలే కారణాలుగా తెలుస్తున్నాయి.
ఉండమంటే ఉండట్లే..
కంటెయిన్మెంట్ సమీప ప్రాంతాలకు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నా జనాల్లో భయం కనిపించడం లేదు. శుక్రవారం లంగర్హౌస్లో ఓ మహిళకు పాజిటివ్ రాగా ఆమె ఫ్యామిలీని హోం క్వారంటైన్ చేశారు. కానీ ఆమె భర్త అర్ధరాత్రి బయటకు వెళ్లి ఫ్రెండ్స్తో మద్యం తాగారు. స్థానికుల కంప్లయింట్తో వారిని పోలీసులు ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లకు ముందు నుంచి టెస్టులు చేయకపోవడమూ కేసుల సంఖ్య పెరగడానికి కారణమని బల్దియా నోడల్ అధికారి చెప్పారు.
అధికారులతో నేతల వాగ్వాదం
జియాగూడ దుర్గానగర్, సాయిదుర్గానగర్, వెంకటేశ్వరనగర్ వంటి ఏరియాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండగా అధికారులు గోపి హోటల్ వద్ద మెయిన్ రోడ్డు నుంచి రాకపోకలు బంద్ చేశారు. శుక్రవారం ఆ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన కంటెయిన్మెంట్జోన్లోని బల్దియా అధికారులపై టీఆర్ఎస్ నేతలు దురుసుగా ప్రవర్తించారు. బారికేడ్లు తొలగించాలంటూ వాగ్వాదానికి దిగారు. జాబ్లకు వెళ్లే వాళ్లను పోనివ్వాలంటూ డిమాండ్ చేశారు. డిప్యూటీ కమిషనర్ జె.సువార్త దృష్టికి వెళ్లడంతో ఆయా పార్టీల నేతలతో సమావేశం పెట్టి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు.

