- ఫీజుల కోసం వేధిస్తే మేనేజ్మెంట్లపై చర్యలు
- ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలె
- త్వరలోనే ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తం: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ ఫైనల్ ఎగ్జామ్స్త్వరలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సెకండియర్ క్లాసులకు ఇబ్బంది లేకుండా, త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామన్నారు. కరోనా కారణంగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించలేదని చెప్పారు. ఫస్టియర్ స్టూడెంట్లందరినీ ప్రమోట్ చేశామని తెలిపారు. సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లు అందరూ ఫస్టియర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలని, తప్పకుండా ఎగ్జామ్స్ రాయాలన్నారు. ఆదివారం తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బుధవారం నుంచి ఫిజికల్ క్లాసులు మాత్రమే జరుగుతాయన్నారు. కరోనా రూల్స్కు అనుగుణంగా సర్కారు స్కూళ్లను రెడీ చేస్తున్నామని, సోమవారం నాటికి ఆ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. జూమ్ ద్వారా డీఈవోలతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని తెలిపారు. అన్ని కాలేజీల మేనేజ్మెంట్లు వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఫీజులను ఒకేసారి కాకుండా, పేరెంట్స్పై భారం పడకుండా నెల నెలా తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు స్కూల్ టీచర్లకు, స్టాఫ్కు మానవతా దృక్పథంతో సర్కారు కరోనా సాయం చేసిందని మంత్రి సబితా గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూళ్లలో విద్యావాలంటీర్ల అవసరం ఉంటే తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు.