కశ్మీర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. నిన్న సాయంత్రం నుంచి సాగిన సుదీర్ఘ ఆపరేషన్ శనివారం తెల్లవారు జామున ముగిసింది. టెర్రరిస్టుల మృతదేహాల వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు కశ్మీర్ పోలీసులు.
దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా గుండ్బాబా సంగం ఏరియాలో టెర్రరిస్టులు దాగి ఉన్నట్లు పోలసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి జమ్ము కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. సుదీర్ఘంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారని శనివారం తెల్లవారుజామున జమ్ము కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మృతుల్లో లష్కరే లోకల్ కమాండర్ ఫర్ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది.