- తిరుమలలో ఘోర అపచారం చేశారు: చంద్రబాబు
- ల్యాబ్ నివేదికలనూ ఫోర్జరీ చేసి, టెండర్లు దక్కించుకున్నారు
- కల్తీకి ఆస్కారం లేకుండా మేం కఠిన నిబంధనలు తెచ్చాం
- కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం
- శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి తీవ్ర నేరం: పవన్ కల్యాణ్
హైదరాబాద్, వెలుగు: తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసి ఘోర అపచారం చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ వివాదం ఉండకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. తప్పు చేసిన పలువురు నిందితులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు. అందుకే ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై మంగళవారం ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ‘తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి.. మహాపాపం’ పేరిట అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019–- 24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని, రూ. 231.51 కోట్ల అవినీతి జరిగిందన్నారు. “ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని నీరుగార్చారు. కల్తీ నెయ్యి అని నివేదికలు వచ్చినా అప్పటి టీటీడీ చైర్మన్ వాటిని తొక్కిపెట్టారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఇచ్చిన నివేదికనే నేను బయటకు వెల్లడించాను. కల్తీ నెయ్యి సరఫరా కోసం టెండర్ నిబంధనల్ని సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సరఫరా చేయాలన్న నిబంధన తొలగించారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించి, రోజుకు12 టన్నుల వెన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 8 టన్నులకు తగ్గించారు. డెయిరీల వార్షిక టర్నోవర్ నిబంధనను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు కుదించారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజి ట్లకు మినహాయింపు ఇచ్చారు” అని చంద్రబాబు వివరించారు.
ల్యాబ్ నివేదికల్నీ ఫోర్జరీ చేశారు..
కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా పోమిల్ జైన్, విపిన్ జైన్తో పాటు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఉందని చంద్రబాబు తెలిపారు. ‘‘ఏఆర్, శ్రీవైష్ణవి, మాల్ గంగా డెయిరీలు భోలే బాబా డెయిరీకి షెల్ కంపెనీలుగా వ్యవహరించాయి. రూ.4.5 కోట్ల లంచం డబ్బుతో నాటి చైర్మన్ పీఏ చిన్నప్పన్న అడ్డంగా దొరికాడు. ల్యాబ్ నివేదికల్ని కూడా ఫోర్జరీ చేసి, టెండర్లు దక్కించుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి రసాయనాలు వాడినట్టు కూడా సిట్ తేల్చింది” అని ఆయన చెప్పారు. టీటీడీలోని సాంకేతిక నిపుణులకు కూడా ఖరీదైన ఫోన్లు ఎరవేసి కల్తీ నెయ్యికి గేట్లు తెరిచారని సీఎం తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులు ఇప్పుడు తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేశామన్నారు.
హిందూ ధర్మంపై దాడిని ఖండించాలి: పవన్ కల్యాణ్
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్ర నేరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక చెబితే.. సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణలో.. అందులో అసలు నెయ్యే లేదని తేలిందన్నారు. “పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే. అక్రమాల్లోనూ కొత్త ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుంది. పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చూపించారు. జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యత. వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలి. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాష, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఇలాంటి పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
