- అమెరికా రీసెర్చ్ సంస్థ వెల్లడి
బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. రెండు నెలల్లోనే దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడేండ్ల పాటు కఠిన ఆంక్షలు విధించిన తర్వాత 2022 డిసెంబర్లో అక్కడి ప్రభుత్వం వాటిని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో 2023 జనవరి నెలాఖరు నాటికి కరోనాతో 19 లక్షల మందికిపైనే మరణించినట్లు తెలిసింది. అమెరికాలోని సియాటిల్కు చెందిన ఫెడరల్ ఫండ్ఫ్రెడ్ హచిసన్ క్యాన్సర్ సెంటర్ చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దహన సంస్కారాలు 70% పెరిగినయ్
కరోనా ప్రపంచమంతటా తగ్గినప్పటికీ చైనాలో మాత్రం దాని ప్రభావం చాలారోజులు కొనసాగింది. దీంతో ఆ దేశం రకరకాల ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఒక్క కేసు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కఠినమైన ఆంక్షలు మూడేండ్ల పాటు కొనసాగించింది. 2022 డిసెంబర్లో కండిషన్లన్నీ ఎత్తివేస్తూ.. కరోనాను జయించామని ఆ దేశం ప్రకటించుకుంది. అప్పటినుంచి దేశంలో ఎంతమంది కరోనా బారిన పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారనే వివరాలు వెల్లడించడం నిలిపివేసింది. అయితే, ఈ ఏడాది మొదటి 3 నెలల్లో దహన సంస్కారాలు 70 శాతం పెరిగాయని చైనాలోని ఓ ప్రావిన్స్ వెబ్సైట్ పేర్కొంది. ఇలాంటి చైనాకు చెందిన పలు వెబ్సైట్ల ద్వారా హచిసన్ క్యాన్సర్ సెంటర్ మరణాల వివరాలను సేకరించి ప్రచురించింది.