న్యూఢిల్లీ, వెలుగు: లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించింది ఢిల్లీ సర్కార్. కొంతవరకు తెగిన కరోనా మహమ్మారి గొలుసుకట్టును పూర్తిగా తెంచేసేందుకు ఈసారి లాక్డౌన్ను మరింత కఠినం చేసింది. తగ్గుతున్న కేసులు మళ్లీ పెరగకుండా ఉండేందుకు ‘కఠిన లాక్డౌన్’ను అమలు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 26న 35 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 23 శాతానికి తగ్గిందని, లాక్డౌన్తోనే చైన్ కొంత వరకు తెగిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే కట్టడి కాడి వదిలేయకుండా ఆంక్షలను కఠినం చేస్తున్నట్టు చెప్పారు. మే 17 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు.
పెండ్లింటి ముందు టెంట్కూ నో
కఠిన లాక్డౌన్లో భాగంగా ఈ సారి.. ఫంక్షన్హాళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో పెండిండ్లను నిషేధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం ఇండ్లు, రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే పెండ్లిండ్లు చేసుకోవాలని తేల్చి చెప్పారు. అది కూడా కేవలం 20 మంది చుట్టాలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పెండ్లింటి ముందు టెంట్ కూడా వేసుకోవద్దని తేల్చిచెప్పారు. పెండ్లి పెట్టుకున్న వాళ్లు ఇప్పటికే కేటరింగ్, డీజే, టెంట్హౌస్లకు డబ్బులు కట్టి ఉంటే.. ఆ వ్యాపారులు డబ్బును తిరిగిచ్చేయాలని, లేదంటే వేరే తేదీలో పెండ్లి పెట్టుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మెట్రో సర్వీసులనూ పూర్తిగా బంద్ పెడుతున్నట్టు ప్రకటించారు.
లాక్డౌన్లోనే సౌలతులు పెంచుకున్నం
ప్రాణం ఉంటెనే ప్రపంచం (జాన్ హై తో జహాన్ హై) ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. గొందిలో ప్రాణాలుంటే జీవితంలో ఎన్నైనా చేయొచ్చన్నారు. లాక్డౌన్ టైంలోనే మెడికల్ పరికరాలు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపు వంటి విషయాలపై ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. మూడు వారాల్లోనే ఆక్సిజన్, ఐసీయూ బెడ్లను భారీగా పెంచుకోగలిగామన్నారు. దీంతో కరోనా కేసులతో పాటు, మరణాలనూ చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. మూడో ఫేజ్లో భాగంగా యువతకూ వ్యాక్సిన్లను వేస్తున్నామని, వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని చెప్పారు. డిమాండ్కు తగ్గట్టు వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామన్నారు.
ఐదోరోజూ తగ్గిన కేసులు..
లాక్డౌన్తో ఢిల్లీలో వరుసగా ఐదోరోజూ కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా13,336 మంది కరోనా బారిన పడగా.. 273 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుతో పోలిస్తే దాదాపు 4 వేల దాకా కేసులు తగ్గాయి. కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 13,23,567కు పెరిగింది. 12,17,991 మంది కోలుకున్నారు. ఇంకా 86,232 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే 1.29 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేశారు.
యూపీలోనూ లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోనూ లాక్డౌన్ను పొడిగించారు. సోమవారంతో ముగియనున్న లాక్డౌన్ను మే 17 వరకు పొడిగిస్తూ యూపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కర్ఫ్యూతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు మే 20 దాకా సెలవులను ప్రకటించాలని ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ క్లాసులనూ బంద్ పెట్టాల్సిందేనని తెలిపింది. భోపాల్లోనూ మే 17 వరకు లాక్డౌన్ను పొడిగించారు.