ములుగు/మంగపేట, వెలుగు : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తూ జిల్లా జడ్జి ఎస్వీపీ సూర్యచంద్రకళ గురువారం తీర్పు వెలువరించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మీడియాకు వివరించారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య గిరిజన మైనర్ బాలికపై అత్యచార యత్నం చేశాడని ఆరోపిస్తూ 2023లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టులో కేసు విచారణ జరిగింది. నేరం నిరూపణ కావడంతో గురువారం జిల్లా జడ్జి ఎఎస్వీపీ సూర్య చంద్రకళ నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20వేల జరిమానా, బాధితురాలికి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తుదితీర్పు వెలువరించారు.
నేరం నిరూపణ, దోషికి శిక్షపడటంలో కీలకంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారి అప్పటి ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ కిషోర్ కుమార్, కోర్టు లైసనింగ్ ఆఫీసర్ ఎస్సై నాగరాజు, సీడీవో మౌనికలను జిల్లా ఎస్పీ అభినందించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని, బాధితులకు న్యాయం కల్పించడానికి పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇలాంటి నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్పీ హెచ్చరించారు.
