
- 25 వేల టన్నులు ఉంటాయని అంచనా.. పాకిస్తాన్ జీడీపీ కంటే 6 రెట్లు ఎక్కువ
- ధరలు పెరిగినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 725 టన్నుల బంగారం అవసరం
న్యూఢిల్లీ: ఇండియాలో కుటుంబాల దగ్గర ఉన్న బంగారం భారీగా పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ప్రకారం, భారతీయ ఇండ్లు, దేవాలయాల దగ్గర సుమారు 25,000 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ 2.4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 200 లక్షల కోట్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేసిన నామినల్ జీడీపీ అంచనాల్లో ఇది 56 శాతం వాటాకు సమానం. ఇండియా జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ 411 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 34 లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్ 2024–25 లో అంచనా వేసింది.
దీనిని బట్టి భారతీయ గృహాల దగ్గర ఉన్న బంగారం విలువ పాకిస్తాన్ జీడీపీ కంటే ఆరు రెట్లు ఎక్కువని అర్థం చేసుకోవచ్చు. అంతేకాక, ఇది ఇటలీ (2.4 ట్రిలియన్ డాలర్లు), కెనడా (2.33 ట్రిలియన్ డాలర్లు) వంటి అభివృద్ధి చెందిన దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ. ఫైనాన్షియల్ కంపెనీ యూబీఎస్ ప్రకారం, 2019–20 నుంచి బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి. దీనితో భారతీయ గృహ ఆస్తుల విలువ కూడా బాగా పెరిగింది. 2026 నాటికి బంగారం ధర ఔన్స్ (28 గ్రాముల)కు 3,500 డాలర్లకు చేరుతుందని అంచనా.
ఇందుకు ట్రేడ్ టెన్షన్స్, ద్రవ్యోల్బణం, జియోపొలిటికల్ రిస్క్లు కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో బంగారం వాల్యూమ్ డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ, ఎక్కువ ధరల వల్ల నెట్ ఇంపోర్ట్స్ విలువ 55–60 బిలియన్ డాలర్ల (జీడీపీలో 1.2శాతం) కు చేరుకునే అవకాశం ఉంది.
ధరలు పెరిగినా..తగ్గని కొనుగోళ్లు
రికార్డు ధరలు ఉన్నప్పటికీ, కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో బంగారం డిమాండ్ 782 టన్నులకు చేరింది. కరోనా ముందుస్థాయి యావరేజ్ కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. నగలకు డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ, బంగారం బార్స్, కాయిన్లలో పెట్టుబడులు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు వీటిలో చేసిన పెట్టుబడుల విలువ ఏడాది లెక్కన 25 శాతం పెరిగింది. 2024 మధ్యలో కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం15శాతం నుంచి 6శాతానికి తగ్గించడం దీనికి సపోర్ట్ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం డిమాండ్ 725 టన్నుల దగ్గర ఉంటుందని యూబీఎస్ అంచనా వేస్తోంది. 2026–27 లో గృహ వినియోగం నిలకడగా ఉంటుందని, ఫలితంగా గోల్డ్ డిమాండ్ 800 టన్నులకు చేరుతుందని లెక్కించింది. ఫిజికల్ సేవింగ్స్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది.
మానిటైజ్ చేయడంలో విఫలం
ఇండియాలో బంగారం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ, ఈ ఆస్తిని మానిటైజ్ చేసే ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. యూబీఎస్ ప్రకారం, 2శాతం కంటే తక్కువ గృహ బంగారం మాత్రమే లోన్స్ కోసం తనఖాగా ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఈ సెగ్మెంట్ను విస్తరించే ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ కనిపించడం లేదు. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళా వంటి ఫైనాన్షియల్ సంస్థలు బంగారం -ఆధారిత లోన్లను ఇవ్వడం పెంచాయి.
అయితే, ఇండియాలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గోల్డ్ నగలతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అమ్మడానికి అంత తొందరగా ఇష్టపడరు. ఇలాంటి భావోద్వేగాల వలన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్), సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీలు) వంటి ఇనీషియేటివ్లు పెద్దగా సక్సెస్ కాలేదు. ఎస్జీబీలను 2024 ఫిబ్రవరిలో ఆపేశారని, దీనికి పెరుగుతున్న బంగారం ధరలు, ప్రభుత్వ లయబిలిటీస్ (భారం) కారణమని యూబీఎస్ పేర్కొంది.
కంట్రోల్లో వాణిజ్య లోటు
బంగారం ఇంపోర్ట్స్ భారీగా ఉన్నప్పటికీ, భారత్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (వాణిజ్య లోటు) మేనేజ్ చేసే స్థాయిలో ఉంది. కరోనా తర్వాత బంగారం నిల్వలు పెరగడం, సర్వీసెస్ వ్యాపారంలో మిగులు ఉండడం, భారీగా రెమిటెన్స్ వస్తుండడంతో బంగారం- దిగుమతుల వలన జరిగే అవుట్ఫ్లోస్ కవర్ అవుతున్నాయని యూబీఎస్ వివరించింది. ప్రపంచంలోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం ఇండియాలో ఉంది. దీంతో గ్లోబల్గా అతిపెద్ద ప్రైవేట్ బంగారం హోల్డర్గా కొనసాగుతోంది.