మహిళా రిజర్వేషన్ అమలు ఎప్పుడు.. ? 2034లోనా లేక 2039లోనా.. ఎందుకింత ఆలస్యం

మహిళా రిజర్వేషన్ అమలు ఎప్పుడు.. ?  2034లోనా లేక 2039లోనా.. ఎందుకింత ఆలస్యం

ఢిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినా అమలుకు కనీసం పదేండ్లు పట్టే అవకాశం ఉంది. ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే 2034 పార్లమెంటు ఎన్నికల నాటికి అమలు చేసే అవకాశం ఉంది. జాప్యం జరిగితే 2039 వరకు పట్టొచ్చన్న విశ్లేషణలూ ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వచ్చిన ఓటర్ల నిష్పత్తి ఆధారంగా మహిళా రిజర్వ్ డ్ నియోజకవర్గాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. దేశంలో తొలిసారిగా 1952లో డీలిమిటేషన్ కమిషన్ చట్టం అమల్లోకి వచ్చింది. చివరగా 2002లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల భౌగోళిక స్వరూపం, పేర్లు, రిజర్వేషన్లు మారాయి. 

తర్వాత 25 ఏండ్లకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే దీనికి 2021 సెన్సెస్ ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అప్పుడు జనాభా లెక్కలు తీయలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే 2026 తర్వాత జరిగే జనగణనను పరిగణనలోకి తీసుకోవాలి. అంటే 2031లో జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కులగణన కూడా జరగాలనే డిమాండ్ కూడా మరో వైపు బలంగా వినిపిస్తోంది. అలా సమగ్రంగా జనాభా లెక్కలు తీసేందుకు ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఆధారం చేసుకున్నా కనీసం రెండేళ్లలో పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటై నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో రెండేళ్లు పట్టినా 2034 నాటికి ఇంప్లిమెంటేషన్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 

డీలిమిటేషన్ తర్వాతే..

మొదట రాష్ట్రపతి అనుమతితో ఐదో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గుర్తిస్తుంది. భౌగోళిక మార్పులనూ పరిగణనలోకి తీసుకుంటుంది. ఓ ముసాయిదాను తయారు చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ గెజిట్ విడుదల చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లలో మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తాజాగా ఓబీసీ మహిళకూ కోటా కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పార్లమెంటులో చర్చ జరుగుతున్న నారీశక్తివందన్ బిల్లులో మార్పులు జరిగి ఓబీసీ కోటా ప్రకటిస్తే..అందులోనూ మహిళా కోటా కేటాయించాల్సి వస్తుంది. వీటన్నింటినినీ పరిగణనలోకి తీసుకొని ఫైనల్ చే యాల్సి ఉంటుంది. సామాజిక వేత్త, రాజకీయ విశ్లేషకుడు యోగేందర్ యాదవ్ మాత్రం 2039 నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. ఆయన అంచనా ప్రకారం మహిళా బిల్లు అమల్లోకి రావడానికి మరో 16 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది