ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు తమ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు సీఎం వైఎస్ జగన్. బ్రిటన్ తరహాలో గ్రామాల్లోనూ వైద్య సేవల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ నాట్కో కేన్సర్ బ్లాక్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో ఏడాదిలోనే కర్నూలు కూడా కేన్సర్ విభాగానికి శ్రీకారం చుడతామన్నారు.
ఎలుకలు కొరికి ప్రాణాలు పోయే పరిస్థితి నాడు
ఈ రోజు ఉదయం కొత్తగా 1,088 అంబులెన్స్లను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం జిల్లాకు రెండు చొప్పున నియోనాటల్ అంబులెన్స్లను అందుబాటులో ఉంచామని సీఎం జగన్ తెలిపారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొస్తున్నామని, రోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.104 అంబులెన్స్ల ద్వారా గ్రామాల్లో వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రతి 5 నుంచి 7 గ్రామాలకు ప్రత్యేకంగా ఓ డాక్టర్ను నియమిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించామని సీఎం వెల్లడించారు.104, విలేజ్ క్లినిక్, పీహెచ్సీలను అనుసంధానిస్తాని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదని, విద్యుత్ సౌకర్యం లేక సెల్ఫోన్ లైట్లతో వైద్యం అందించిన పరిస్థితిని చూశామని నాటి గడ్డు పరిస్థితులను గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రజల ఆరోగ్య రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సీఎం పేర్కొన్నారు.
బ్రిటన్ తరహాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
‘ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం ఇద్దరు డాక్టరులు ఉంటారు. అలాగే 104 అంబులెన్స్లో మరో డాక్టరు ఉంటారు. ప్రతి మండలానికీ కనీసం రెండు పీహెచ్సీలు ఉంటే.. రెండు అంబులెన్స్లు వాటి పరిధిలోని గ్రామాలను పంచుకుంటారు. నెలకు కచ్చితంగా ఒక ఊరికి డాక్టరు పోయే విధంగా వ్యవస్థ ఉంటుంది. ప్రతి పేషెంటు ఆరోగ్య వివరాలు ఎలక్ట్రానిక్ డేటాలోకి వెళ్తాయి. పరీక్షలు చేయడమే కాకుండా వారికి మందులు ఇస్తారు. మిగిలిన రోజుల్లో ఆ డాక్టరు పీహెచ్సీలో ఉంటారు. బ్రిటన్లోని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఇక్కడ అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది విప్లవాత్మక మార్పు’ అని చెప్పారు సీఎం వైఎస్ జగన్.
2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులను జాతీయ ప్రమాణాలు ఉండేట్టుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకూ 11 మెడికల్ కాలేజీలు ఉంటే… మరో 16 మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నామని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ ఆస్పత్రిని తీసుకు వస్తున్నామని గర్వంగా చెప్పగలుగుతున్నామన్నారు. ‘ట్రైబల్ ఏరియాల్లో 7 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. పలాస, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆస్పత్రులను కడుతున్నాం. ఆరోగ్యశ్రీ రూపు రేఖలను పూర్తిగా మారుస్తున్నాం. జులై 8 నుంచి మరో ఆరు జిల్లాల్లో, నవంబర్ 14 నాటికి అన్ని జిల్లాల్లో 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పక్కరాష్ట్రాల్లోని మంచి ఆస్పత్రుల్లోకూడా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం’ అని అన్నారు సీఎం జగన్.