- ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో రూ.21 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. తమ దావోస్ పర్యటన విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఫార్మా రీసెర్చ్ సంస్థ యూరోఫిన్స్ హైదరాబాద్లో తమ వ్యాపార విస్తరణకు ముందుకు వచ్చిందన్నారు. లండన్ తర్వాత హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించేందుకు అపోలో టైర్స్ ముందుకు వచ్చిందన్నారు. అలాక్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకుందన్నారు. పెప్సికో ఉత్పత్తులు రెట్టింపు చేయబోతుందని తెలిపారు. వెబ్ పీటీ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ ఏర్పాటు చేయబోతుందన్నారు.
నాలుగు రోజుల్లో ఇంటర్నేషనల్, నేషనల్ కంపెనీల ప్రతినిధులతో 52 సమావేశాలు, ఆరు రౌండ్ టేబుల్ మీటింగులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో రెండు చర్చాగోష్టుల్లో పంచుకున్నామని తెలిపారు. మొత్తంగా రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. దావోస్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ఈసారి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిందన్నారు. ఎమ్మెన్సీలు, పలు దేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య సంస్థల అధిపతులు, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగం పంచుకునే మేధావులు, ఎంతో మంది నిపుణులు తెలంగాణ పెవిలియన్ను సందర్శించారని తెలిపారు. తాము చేపట్టిన టీ హబ్, టీ వర్క్స్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై రూపొందించిన వీడియోలను వాళ్లు చూశారని వెల్లడించారు.ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్లోని జూరిక్లో నివాసముంటున్న ఎన్ఆర్ఐలతో కేటీఆర్ సమావేశమయ్యారు.