- ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్కు హెల్ప్ చేస్తే రివార్డ్ ఇప్పిస్తానంటూ గ్యాంగ్ ఏర్పాటు
- టెర్రరిస్ట్ కొడుకు అంటూ ఓ యువకుడి కిడ్నాప్
- ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించి డబ్బు వసూలు
- బాధితుడి ఫిర్యాదుతో గ్యాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్,వెలుగు: ఆర్మీ ఇంటెలిజెన్స్ టీమ్, అండర్కవర్ ఆపరేషన్ అంటూ కిడ్నాప్, బెదిరించి డబ్బు వసూలు చేసిన గ్యాంగ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫేక్ కర్నల్గా అవతారం ఎత్తిన ఓ 21 ఏండ్ల యువకుడు ఈ కిడ్నాప్ డ్రామా, డబ్బు వసూలుకు ప్లాన్ చేశాడు. ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్కు హెల్ప్ చేస్తే రివార్డ్ ఇప్పిస్తానని నమ్మించి ముగ్గురితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. టెర్రరిస్ట్ కొడుకును సీక్రెట్గా అరెస్ట్ చేయాలని చెప్పి వారితో ఓ యువకుడిని కిడ్నాప్ చేయించాడు. మీ తండ్రి, అతని ఫ్రెండ్ టెర్రరిస్ట్లకు వెపన్స్ సప్లై చేస్తున్నారని.. వాళ్లను ఎన్కౌంటర్ చేస్తామని యువకుడిని బెదిరించాడు.
వారి నుంచి డబ్బు వసూలు చేసి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఇంట్రెస్టింగ్ కేసు వివరాలు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం మీడియాకు చెప్పారు. వెస్ట్ గోదావరి జిల్లా కొమ్ముచికల గ్రామానికి చెందిన నాగరాజు రఘువర్మ(21) అలియాస్ ఎస్ఎస్ కర్నల్ కార్తికేయ ఇంటర్ చదివాడు. 2017లో హైదరాబాద్ వచ్చాడు. సనత్నగర్, పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఇండ్లలో చోరీలు చేసి దొరికిపోయి జైలుకెళ్లాడు. 2018లో ఆర్మీ జాబ్కు ట్రై చేశాడు. . క్రిమినల్ రికార్డు ఉండడంతో ఆర్మీకి సెలెక్ట్ కాలేదు. ఆ టైమ్లో ఆర్మీ యూనిఫామ్స్, బ్యాడ్జెస్, కేడర్, ర్యాంకులపై అవగాహన పెంచుకున్నాడు పంజాగుట్టకు చెందిన మధుసూదన్ రావు దగ్గర డ్రైవర్గా పనిచేసి మానేశాడు. తరువాత ఆర్మీ యూనిఫామ్ కొనుక్కొని.. ఫేక్ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు.
ఫేక్ ఐడీతో ఎయిర్ గన్స్, పిస్టల్స్ కొనుగోలు
ఆర్మీ ఆఫీసర్ కర్నల్ ఎస్ఎస్ కార్తికేయగా ఫేక్ ఐడీ కార్డు చూపించి లాల్ బజార్, నారాయణగూడలో రెండు ఎయిర్ గన్స్, డమ్మీ పిస్టల్స్ కొనుక్కున్నాడు. కిరాయి కారుపై ఆర్మీ ఆఫీసర్ స్టిక్కర్ అంటించుకొని సొంతూరు, ఆ చుట్టుపక్కల కర్నల్గా బిల్డప్ ఇచ్చాడు. ఆర్మీ యూనిఫామ్లో ఉన్న ఫొటోలతో భారీ కటౌట్స్ ఏర్పాటు చేయించుకొని లోకల్గా పలు ప్రోగ్రామ్స్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నాడు. ఆర్మీలో జాబ్స్ ఇప్పిస్తానని యూత్ను ట్రాప్ చేసి రూ.6.8 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బుతో హైదరాబాద్ హఫీజ్పేట్లో ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ ఓపెన్ చేశాడు,
సీక్రెట్ ఆపరేషన్.. రివార్డుల పేరిట గ్యాంగ్ ఏర్పాటు
కర్నల్గా చెప్పుకొని ఎర్రమంజిల్లో ఉండే ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆర్మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తరఫున అండర్కవర్ ఆపరేషన్లో ఉన్నట్లు నమ్మించాడు. యువతికి తెలిసిన కల్లెపల్లి రాజేశ్(26), యూసుఫ్గూడలో సీసీటీవీ టెక్నీషియన్గా పనిచేస్తున్న లవేటి రామకృష్ణ(36), నిజాం కాలేజ్లో చదువుకుంటున్న కామారెడ్డి జిల్లా నెరాల తండాకు చెందిన రాబ్ద్యా జోరే సింగ్(19)తో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. హెల్ప్ చేసినందుకు వాళ్లకు ఆర్మీ, కేంద్రం నుంచి రివార్డ్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. టెర్రరిస్టులకు వెపన్స్ సప్లై చేస్తున్న వ్యక్తులను సీక్రెట్గా అరెస్ట్ చేయాలని గ్యాంగ్ మెంబర్లకు చెప్పి ఈ నెల 4న బంజారాహిల్స్లో ప్లాన్ చేశాడు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హ్యాండ్ కఫ్స్తో బిల్డప్
నాగరాజు డ్రైవర్గా పనిచేసిన మధుసూదన్ ఫ్రెండ్ శ్రీనివాస్ కుమారుడు నిఖిల్ను టార్గెట్ చేశాడు. తన గ్యాంగ్తో ఈ నెల 5న గాంధీనగర్ ఎస్బీఐ కాలనీలోని నిఖిల్ గురించి ఎంక్వైరీ చేయించాడు. నిఖిల్ బిజినెస్ పనిమీద బీహెచ్ఈఎల్ వెళ్లాడని.. సాయంత్రం 6 గంటలకు వస్తాడని తెలుసుకున్నారు. అదే టైమ్కు రోడ్డులో కాపు కాసీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లమంటూ అంతని కారులోనే అతన్ని కిడ్నాప్ చేశారు. హఫీజ్పేట్లోని ఆయుర్వేదిక్ స్టోరీకి తీసుకెళ్లారు. హ్యాండ్ కఫ్స్ వేసి ఓ రూమ్లో ఉంచారు. ఆర్మీ డ్రెస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, చేతిలో డమ్మీ పిస్టల్తో వచ్చిన నాగరాజు తనను తాను కర్నల్ ఎస్స్ కార్తికేయగా చెప్పుకొన్నాడు. మధుసూదన్, మీ తండ్రి టెర్రరిస్టులకు వెపన్స్ సప్లై చేస్తున్నారని.. వారిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నామని.. వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలంటూ బెదిరించాడు. కొద్ది సేపటి తరువాత నీకు స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి అతని వద్ద ఉన్న రూ.26 వేలు తీసుకున్నాడు. నిఖిల్ను రోడ్డుపై వదిలేసి అతని కారులోనే గ్యాంగ్ మెంబర్స్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అండర్కవర్ ఆపరేషన్ అనుకొని కిడ్నాప్కు హెల్ప్ చేసిన రాజేశ్, రామకృష్ణ, జోరే సింగ్లకు ఖర్చుల కోసమని చెప్పి 14వేలు ఇచ్చి రూమ్ వద్ద దింపేసి మిగతా డబ్బుతో ఎస్కేప్ అయ్యాడు. బాధితుడి కంప్లైంట్తో ఎంక్వైరీ చేపట్టిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు నాగరాజు గ్యాంగ్ను అరెస్ట్ చేసి, ఆర్మీ డ్రెస్, ఫేక్ ఐడీ కార్డులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, మూడు డమ్మీ పిస్టల్స్, రెండు హ్యాండ్ కఫ్స్ స్వాధీనం చేసుకున్నారు.