వరదనీటిలో కరెంట్ షాక్తో కూతురు.. కాపాడబోయి తండ్రి..ఇద్దరు మృతి

వరదనీటిలో కరెంట్ షాక్తో కూతురు.. కాపాడబోయి తండ్రి..ఇద్దరు మృతి

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు..తండ్రి కళ్లముందే కరెంట్ షాక్ తో గిలగిల కొట్టుకుంటుంటే..ఆ తండ్రి హృదయం తల్లడించింది.. బిడ్డను కాపాలనే ఆరాటం.. మరో క్షణం ఆలోచించకుండా నీటీలో దూకాడు.. కానీ బిడ్డను కాపాడుకోవాలన్నా ప్రయత్నం ఫలించలేదు. కన్న కూతురితోపాటే అతను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు.నిమిషాల్లో అంతా అయిపోయింది.. తండ్రీ బిడ్డలు కరెంట్ కు బలయ్యారు. హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్ లో హౌరా జిల్లాలో జరి గింది. 

పశ్చిమబెంగాల్ ను భారీవర్షాలు, వరదలుముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులు కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లా శాల్కియా ప్రాంతంలో ఓ కాలనీ కూడా పూర్తిగా నీటి మునిగింది. ఓ విద్యుత్ వైరు తెగి కాలనీ ప్రవహిస్తున్న నీటిలో పడింది. అదే వారి పాలిట మృత్యువుగా మారింది. శాల్కియా ప్రాంతంలో నివాసం ఉంటూ.. షాపును నిర్వహిస్తున్న ఓ స్థానికుడు, అతని 22 యేళ్ల కూతురు ఇద్దరు కరెంట్ షాక్ తో మృతి చెందారు. మృతురాలు విద్యార్థిని పుర్విగా గుర్తించారు. 

శాల్కియా కాలనీలోని ఓ బర్త్ డే పార్టీకి వెళ్లేందుకు తయారైన పుర్వి.. చెప్పి వెళ్లాలని అదే కాలనీలో షాపు నిర్వహిస్తున్న తండ్రి దగ్గర వెళ్లింది.. తండ్రి చేరే క్రమంలో కాలనీలో ప్రవహిస్తున్న వరద నీటిలో కరెంట్ వైర్ తెగి పడటంతో పుర్వి షాక్ కు గురయ్యింది. నీటిలో కొన్ని మీటర్ల దూరం విసిరి వేయబడింది. అది చూసిన తండ్రి కూతురుని రక్షించుకునే క్రమంలో నీటిలో దూకాడు. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ రావడంతో నీటిలోనే గిలగిలా కొట్టుకున్నారు. 

వెంటనే స్పందించిన స్థానికులు కరెంట్ డిపార్టుమెంట్ కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ పుర్వి ప్రాణాలు కోల్పోయింది.. ఆమె తండ్రి కూడా మృత్యువుతో పోరాడి ఇవాళ చనిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.