తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా

తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా

చెన్నై: తమిళ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. చెన్నైలో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులకు కరోనా వచ్చిందన్న విషయం బయటపడిన కొద్ది గంటల్లోనే మరో 25 మంది వైరస్ బారిన పడినట్లు వెల్లడించింది. వారందరికీ ఒమదురార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ‘‘చానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సిబ్బందితో కలిపి మొత్తం 90 మందికి పైగా శాంపిల్స్ టెస్టులకోసం సేకరించాం. అందులో 25 మందికి రిజల్ట్ పాజిటివ్ వచ్చింది’’ అని ఒక అధికారి మీడియాతో చెప్పారు.

ముంబైలో 53 మంది జర్నలిస్టులకు వైరస్
ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం తెలిపింది. ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఏర్పాటు చేసిన కరోనా టెస్ట్ సెంటర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్​లు సహా 171 మంది మీడియా పర్సన్స్ నుంచి శాంపిల్స్ సేకరించగా అందులో 53 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించింది. వారందరికీ ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం లాంటి ఎలాంటి రోగ లక్షణాలు లేవని తెలిపింది. పాజిటివ్ వచ్చినవారందరినీ ఐసోలేషన్ లో ఉంచి, వారంతా ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పింది.