ఉగాండాలో దారుణం చోటుచేసుకుంది. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 25 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ''అలయిడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్కు చెందిన 20 నుంచి 25 మంది తిరుగుబాటుదారులు .. లుబిరిరా సెకండరీ పాఠశాలపై దాడులు జరిపారు. అనంతరం వసతిగృహానికి నిప్పుపెట్టారు. ఇప్పటివరకు (వార్త రాసే సమయానికి) 25 మృతదేహాలను వెలికితీశారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడి ఆహారశాలనూ వారు దోచుకున్నారు.. దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించారు.. వారిని వెంటాడుతున్నాం'' అని పోలీసులు చెప్పారు. పరారయ్యే ముందు పలువురిని అపహరించుకుపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఈ ఘాతుకానికి పాల్పడినవారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. యుపిడిఎఫ్ (ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్), పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు పోలీసులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. కొంతమందిని దుండగులు ఎత్తుకుపోయినట్లుగా తెలుస్తోంది.
ఉగాండా ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో 1995లో కాంగోలోని ఉగాండా ప్రవాసులు ADFని ఏర్పాటు చేశారు. 2001లో ఉగాండా ఎదురుదాడితో వారు తూర్పు కాంగోలోకి పారిపోయి అక్కడి నుండి హింసకు తెగబడుతున్నారు. ADFకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ADFను తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది. ఐక్య రాజ్య సమితి 2020లో ADFను హింసాత్మక గ్రూప్ గా పేర్కొంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం, యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 2021లో ADFని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థగా అలాగే విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పేర్కొంది.
